అప్పులబాధ తాళలేక దళితరైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-26T06:58:15+05:30 IST
అప్పుల బాధ తాళలేక దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని నెలవాయి దళితవాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బుచ్చినాయుడుకండ్రిగ, మే 25: అప్పుల బాధ తాళలేక దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని నెలవాయి దళితవాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పోలూరు వెంకటేశు(49) తనకున్న మూడు ఎకరాలలో నాలుగేళ్లుగా వరి, వేరుశెనగ పంటలు సాగుచేశాడు. సాగుకు అప్పులు చేశాడు. పంటలు సక్రమంగా పండకపోవడంతో అప్పులు తీరలేదు. అదేసమయంలో కుమార్తెకు విహహం చేశాడు. దీంతో అప్పులు, వడ్డీలు సుమారు రూ. 12లక్షలకు చేరాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక ఆదివారం సాయంత్రం తన ఇంటి సమీపంలోని రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. స్థానికులు గుర్తించి అతడిని శ్రీకాళహస్తి ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్కు తరలించారు. చిక్సిత పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. రుయా పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బీఎన్ కండ్రిగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.