క్షణికావేశంలో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-04T06:39:08+05:30 IST
భార్య పెట్టింటికి వెళ్లిందని క్షణికావేశంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపం
మూన్నెళ్ల క్రితమే గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తి
ఖానాపూర్ రూరల్, డిసెంబర్ 3 : భార్య పెట్టింటికి వెళ్లిందని క్షణికావేశంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖానాపూర్ మండలం నడింపల్లె గ్రామానికి చెందిన కొత్తగొండ శ్రీనివాస్ (36) మూన్నెళ్ల క్రితం గల్ఫ్ నుంచి వచ్చాడు. అప్పటి నుంచి స్థానికంగా వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. తన తల్లిగారింటి వద్ద పండుగ చేస్తున్నారని, ఇద్దరం కలిసి వెళ్దామని భార్య లావణ్య శ్రీనివాస్ను బుధవారం కోరింది. అందుకు శ్రీనివాస్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో లావణ్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. క్షణికావేశానికి లోనైన శ్రీనివాస్ తన తోటలో బుధవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భవానీసేన్ తెలిపారు. శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులున్నారు.