రహదారిని ఆక్రమించి..
ABN , First Publish Date - 2022-09-04T06:34:13+05:30 IST
కలిదిండి – మద్వానిగూడెం ప్రధాన రహదారి వెంబడి అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లాగా వెలిశాయి.
కలిదిండి – మద్వానిగూడెం ప్రధాన రహదారిపై ఆక్రమణలు
అధికారులు నోటీసులిచ్చినా బేఖాతర్
అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లే చర్యలు లేవంటూ ఆరోపణలు
కుంచించుకుపోయిన రహదారిపై ట్రాఫిక్ వెతలు.. ప్రమాదాలు
కలిదిండి, సెప్టెంబరు 3 : కలిదిండి – మద్వానిగూడెం ప్రధాన రహదారి వెంబడి అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లాగా వెలిశాయి. రహదారి పక్కనే మార్కెట్ యార్డు ప్రహరీ ఆనుకుని అక్రమంగా రేకుల షెడ్లు షాపులు, లారీ ఆఫీసులు ఏర్పాటు చేశారు. కలప వ్యాపారం జోరుగా సాగుతోంది. యార్డు వెంబడి ఆక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులు పలు మార్లు చెబుతున్నా ఆక్రమణదారులు పట్టించుకోవటం లేదు. గుర్వాయిపాలెం నుంచి మద్వానిగూడెం ప్రధాన రహదారి ఇరుపక్కలా వెల్డింగ్ వర్క్ షాపులు విచ్చల విడిగా వెలిశాయి. రహదారి మార్జిన్ ఆక్రమించుకుని వెల్డింగ్ షాపుల ఏర్పాటు చేయటంతో రహదారి కుంచించుకుపోవటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో పలు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇనుప సామగ్రిని రహదా రిపై వేస్తున్నారు. రోడ్డు మార్జిన్ను ఆక్రమించుకున్న వెల్డింగ్ వర్క్ షాపుల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసినా ఇంత వరకు ఎందుకు తొలగించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్ అండ్ బీ స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించాలని గతంలో అధికారులు హడావిడి చేశారు. కోరుకొల్లు నుంచి మద్వానిగూడెం వంతెన వరకు రహదారి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను, ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత వాటిని తొలగించటానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఆక్రమణలను తొలగించటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాలని, రాష్ట్ర రహదారిని విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం : ఆర్అండ్బీ డీఈ
ఈ విషయమై ఆర్ అండ్ బీ డీఈ విజయ శ్రీకర్ను వివరణ కోరగా, రహదారి వెంబడి అక్రమ కట్టడాలను, అక్రమంగా ఏర్పాటు చేసిన వెల్డింగ్ వర్క్ షాపులను తొలగించటానికి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.