ఉన్న భవనం వదిలేసి.. కొత్తగా నిర్మాణాలా?
ABN , First Publish Date - 2021-07-22T05:49:32+05:30 IST
రాష్ట్రం అప్పుల్లో ఉందని ఘోషిస్తున్నారు. మరి దుబారాను నివారించవలసిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
అసంపూర్తిగా పంచాయతీ భవనం
ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించి సగంలో ఆపేశారు..
రాష్ట్రం అప్పుల్లో ఉందని ఘోషిస్తున్నారు. మరి దుబారాను నివారించవలసిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పలు అభివృద్ధి పథకాలకు నిధులు లేక కునారిల్లుతుంటే కొన్ని చోట్ల మాత్రం నిర్మాణాలు ప్రారంభించి వదిలేశారు. దీంతో నిధులు వృథా కావడంతోపాటు సగంలో ఆగిన భవనం శిథిలావస్థకు చేరుతోంది. ఇందుకు ఉదాహరణ ఉసులుమర్రులో సగంలో వదిలి వేసిన ప్రభుత్వ భవనం.
పెరవలి, జూలై 21: గతంలో టీడీపీ అధికారంలోకి రాకముందు ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ నిధులు సుమారు రూ. 5 లక్షలతో పం చాయతీ భవన నిర్మాణం ప్రారంభించారు. అనంతరం వేరే పార్టీకి చెందిన వారు అధికారంలోకి రావడంతో ఈ భవనం నిర్మాణంపై నీలి నీడ లు కమ్ముకున్నాయి. గ్రామంలో నాయకులు మధ్య సయోధ్య లేక ఈ భవన నిర్మాణం పూర్తి చేయడానికి ఒకరికొకరు సహకరించుకోకపోవడంతో అప్పటి వరకు ఖర్చు చేసిన నిధులన్నీ వృథా అయ్యాయి. ఇప్పటికి సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఈ భవన నిర్మాణం ప్రారంభమైనప్పటికీ అసంపూర్తిగా నే నిలిచిపోయింది. మరిన్ని నిధులు జోడించి భవన నిర్మాణం పూర్తి చేస్తే గ్రామంలో పలు విధాలా ఉపయోగపడుతుంది. దీనిని పట్టించుకోకుండా గ్రామంలో ఇతర ప్రదేశాల్లో సచివాలయ భవనం, ఆరోగ్య కేంద్ర భవనం, రైతు భరోసా వంటివి వేరే ప్రదేశాల్లో నిర్మిస్తున్నారు. దీంతో గ్రామం మధ్య లో ఉన్న అసంపూర్తి నిర్మాణం పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.