HYD: ‘ఆన్లైన్’ బంద్ ..!
ABN , First Publish Date - 2021-10-19T16:31:44+05:30 IST
‘ఆన్లైన్..
రేపటి నుంచి బడికి రావాలని సందేశాలు
80 శాతం ప్రైవేటు విద్యాసంస్థల నిర్ణయం
హైదరాబాద్ సిటీ: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇక ఆన్లైన్ క్లాసులకు తెరపడనుంది. కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇంటి నుంచే ఆన్లైన్లో పాఠాలు వింటున్న విద్యార్థులు ఈనెల 20 నుంచి రోజూబడికి వెళ్లాల్సి ఉంటుంది. నగరంలోని 80 శాతం ప్రైవేట్ విద్యాలయాలు బుధవారం నుంచి రెగ్యులర్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు సందేశాలు పంపాయి.
20 నుంచి రెగ్యులర్ పాఠాలు..
జిల్లాలోని 16 మండలాల పరిధిలో 690 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుండగా 1,04,461 మంది చదువుకుంటున్నారు. 1,886 ప్రైవేట్ విద్యా సంస్థల్లో సుమారు 8.90 లక్షల మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. కరోనా ఆంక్షలకు లోబడి సెప్టెంబర్ 1 నుంచి సరి, బేసి సంఖ్యలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న 80 శాతం ప్రైవేట్ యాజమాన్యాలు ఈనెల 20 నుంచి ప్రత్యక్ష్య క్లాసులను బోధించేందుకు సిద్ధమయ్యాయి. ఉదయం 8.50 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు ప్రత్యక్ష్య పాఠాలు చెప్పాలని నిర్ణయించాయి. కొన్ని స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు క్లాసులు నిర్వహించనున్నాయి. దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో పిల్లలకు మెరుగైన విద్యనందించాలనే ఉద్దేశంతో రోజువారీ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.
తల్లిదండ్రుల అంగీకారం మేరకే..
ఆన్లైన్ క్లాసులు ఉండవని చెబుతున్న ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను బడికి పంపించే బాధ్యతలను తల్లిదండ్రులకే అప్పగిస్తున్నాయి. ‘‘మేం రెగ్యులర్ క్లాసులు మొదలుపెడుతున్నాం. పిల్లలను స్కూల్కు పంపడంపై అంగీకారం తెలపండి’’ అని తల్లిదండ్రులకు సూచిస్తుండడంతో కొంతమంది సందిగ్ధంలో పడ్డారు.