వందశాతం ఎల్ఆర్ఎస్ సాధించేలా చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-09-24T07:06:46+05:30 IST
గ్రామ, పట్టణ స్థాయిలో ఆమోదం లేని లేఅవుట్లు, ఫ్లాట్లను గుర్తించి వందశాతం ఎల్ఆర్ఎస్ సాధించేలా చర్యలు
రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్
కరీంనగర్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రామ, పట్టణ స్థాయిలో ఆమోదం లేని లేఅవుట్లు, ఫ్లాట్లను గుర్తించి వందశాతం ఎల్ఆర్ఎస్ సాధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సీఎంఆర్, ఎల్ఆర్ఎస్, పల్లె ప్రకృతి వనాలు, స్ర్టీట్ వెండర్స్ రుణాలు, రైతు వేదికలు, పట్టణ ప్రగతిలో నర్సరీలు, అర్బన్ ట్రీ. పార్కులు, పల్లె ప్రకృతి కార్యక్రమాలపై జిల్లాల వారిగా సమీక్షించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ, సెక్రటరీ జనార్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ ప్రతిరోజు రైస్ మిల్లు నుండి ఎఫ్ఐసీకి పంపిస్తున్న ధాన్యం వివరాలను, బ్యాలెన్స్ వివరాలను తెలియజేయాలని, సీఎంఆర్ లక్ష్యాన్ని వచ్చే ఏడు రోజుల్లో పూర్తి చేయాలని, ఎలాంటి పెండింగ్ ఉండరాదని తెలిపారు.
రైతు వేదికల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పేమెంట్స్ వెంటవెంటనే చెల్లించాలని, అన్ని హంగులతో రైతు వేదిక భవనాలు పూర్తి చేయాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనాల పనులు వేగంగా పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. పట్టణ పరిధిలో వీధి వ్యాపారులకు రుణ మంజూరులో లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఈ నెల 30లోగా నర్సరీల ఏర్పాటుకు స్థలాల ఎంపిక, నిర్వహణపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనతో గ్రామ పంచాయతీ సర్పంచ్, సెక్రటరీల భాగస్వామ్యంతో పల్లెప్రగతి కార్యక్రమాలను అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ సీఎంఆర్, ఎల్ఆర్ఎస్, పల్లె ప్రగతి వనా లు, వీధి వ్యాపారులకు రుణాలు, రైతు వేదిక నిర్మాణాలు, పట్టణ, పల్లె ప్రగతి నర్సరీలు, పార్కుల నిర్మాణాల పూర్తికి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామని, ఎల్ఆర్ఎస్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.