అడుగుకో గుంత

ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST

అడుగుకో గుంత

అడుగుకో గుంత
ధర్మన్నగూడ సమీపంలో గుంతలమయంగా రోడ్డు


  • గుంతలమయంగా రహదారులు
  • మరమ్మతులు చేపట్టని అధికారులు
  • గోసతీస్తున్న వాహనాదారులు 

యాచారం, మే 18 : మారుమూల గ్రామాల రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. గుంతలు పడి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాటికి మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం ఉండడం లేదు. యాచారం మండలంలోని ధర్మన్నగూడ గేటు నుంచి చౌదర్‌పల్లి గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసమైంది. రోడ్డునిండా కంకర తేలి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీనికి తోడు గుంతలు కూడా ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఈ రోడ్డుపై గుంతలు అర అడుగు లోతు వరకు ఉన్నా వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ గుంతల్లో వాహనదారులు పడి తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కందుకూరు మండలం కొలన్‌గూడ నుంచి యాచారం మండలకేంద్రం వరకు ఉన్న రోడ్డు కూడా ధ్వంసమైంది. ఈ రోడ్డుకు మరమ్మతులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది.  

ఆ నిధులతో కాంట్రాక్టర్‌ కొలనుగూడ గేటు నుంచి ధర్మన్నగూడ గేటు వరకు, చౌదర్‌పల్లి నుంచి యాచారం వరకు బీటీ వేశారు. అయితే, ధర్మన్నగూడ గేటు నుంచి చౌదర్‌పల్లి వరకు మాత్రం పాడైన రోడ్డుకు మరమ్మతు చేయకుండా వదిలేశారు. ఈ రెండు గ్రామాల మద్య పాడైన రోడ్డు ను బాగు చేయకుండ కాంట్రాక్టర్‌ వదిలేయడంతో స్తానికులు విసుక్కుంటున్నారు.  ఈ రెండు గ్రామాల మధ్యపాడైన రోడ్డుకు ఎందుకు మరమ్మతులు చేయడం లేదో అర్ధం కావడం లేదని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ధర్మన్నగూడ గేటు నుంచి చౌదర్‌పల్లి గ్రామాల మధ్య రోడ్డుకు మరమ్మతు చేయించి వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-18T05:30:00+05:30 IST