విద్యుత్ వివాదాన్ని రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం
ABN , First Publish Date - 2021-12-21T22:29:05+05:30 IST
విద్యుత్ బకాయిల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే
న్యూఢిల్లీ: విద్యుత్ బకాయిల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ వెల్లడించారు. విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉభయులకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు ఆర్కె సింగ్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ ఈ ఏడాది జూలై 14న తమకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగిందని ఆయన పేర్కొ్న్నారు.
మొదట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పొందిన విద్యుత్కు తెలంగాణ చెల్లింపులు జరిపిందన్నారు. విద్యుత్ చార్జీలకు సంబంధించి తెలంగాణ బకాయిపడ్డ సొమ్ములో అసలుపై ఎలాంటి వివాదం లేదన్నారు. అసలుపై విధించిన వడ్డీ విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య పేచీ వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ వడ్డీ చెల్లింపుపై పవర్ పర్చేజ్ ఒప్పందంలోని షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సామరస్య ధోరణిలో రాజీకి రావలసి ఉంటుందని మంత్రి అన్నారు. విద్యుత్ బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఈ అంశం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ఉభయ రాష్ట్రాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవడమే మార్గమని ఆయన పేర్కొ్న్నారు.