రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
ABN , First Publish Date - 2020-11-01T10:19:40+05:30 IST
రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శనివారం టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ గద్దె బాబూరావు
టీడీపీ బాటలోనే వైసీపీ
ప్రభుత్వ అవినీతిని బయటపెడతాం
మండలాల వారీగా కమిటీలు నియామకం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
బీజేపీలో చేరిన గద్దె బాబూరావు
విజయనగరం దాసన్నపేట, అక్టోబరు 31: రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శనివారం టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ గద్దె బాబూరావు బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్దేవధర్ సాదరంగా ఆహ్వానించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి దేశంలో అత్యున్నత పదవిని ఇచ్చి బీజేపీ తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఎన్టీఆర్కు నిజమైన వారసురాలు పురందేశ్వరేనని చెప్పారు. అందుకే టీడీపీ శ్రేణులు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. నమ్మించి మోసం చేయడంలో ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ విధానాలనే వైసీపీ కొనసాగిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఈ విషయంలో బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు.
వైసీపీ చేసే అవినీతిని బయటపెడతామని..ఇందుకు మండలాల వారీగా కమిటీలను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. సునీల్దేవధర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజెపీ-జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీలు కులతత్వ అవినీతి వారసత్వ పార్టీలని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో టీటీడీ, సింహాచలం భూములకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, భవిరెడ్డి శివప్రసాద్రెడ్డి, పి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.