పంచాయతీ మొదలు
ABN , First Publish Date - 2021-01-27T06:01:34+05:30 IST
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.
అనకాపల్లి డివిజన్లో
పంచాయతీలు 344
వార్డులు 3,286
పోలింగ్ కేంద్రాలు 3,342
ఓటర్లు 5,98,255
పురుషులు 2,93,444
మహిళలు 3,04,785
ఇతరులు 26
మండలాలు: 12
1. అనకాపల్లి, 2. కశింకోట, 3.ఎలమంచిలి, 4. రాంబిల్లి, 5. అచ్యుతాపురం, 6. మునగపాక, 7. చోడవరం, 8.బుచ్చెయ్యపేట, 9.చీడికాడ, 10. కె.కోటపాడు, 11. దేవరాపల్లి, 12. వి.మాడుగుల
మేజరు పంచాయతీలు
1. చోడవరం, 2. గోవాడ, 3. వడ్డాది (బుచ్చెయ్యపేట మండలం), 4. కె.కోటపాడు, 5. చౌడువాడ (కె.కోటపాడు మండలం), 6. దేవరాపల్లి, 7. మాడుగుల, 8. కస్పాజగన్నాథపురం (మాడుగుల మండలం), 9. మునగపాక, 10. కశింకోట, 11. తాళ్లపాలెం (కశింకోట మండలం), 12. హరిపాలెం (అచ్యుతాపురం మండలం), 13. దిబ్బపాలెం, 14. ఏటికొప్పాక (ఎలమంచిలి మండలం), 15. తుమ్మపాల (అనకాపల్లి మండలం), 16. కొత్తూరు (అనకాపల్లి మండలం)
తొలి విడత అనకాపల్లి డివిజన్ పరిధిలో ఎన్నికలకు నేడే నోటిఫికేషన్
29 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 9న పోలింగ్
అధికారులు సమాయత్తం
జిల్లాలో 968 పంచాయతీలు: 9532 వార్డులు
17.84 లక్షల మంది ఓటర్లు
నేడు కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో 968 పంచాయతీలు, 9,532 వార్డులు ఉన్నాయి. మొత్తం 17,84,678 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు నాలుగు విడతలుగా జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు ప్రత్యక్షంగా 25 వేల మంది, పరోక్షంగా మరో పాతిక వేల మంది వరకు అవసరమని అంచనా వేస్తున్నారు. వీరు కాకుండా మరో పది వేల మంది సేవలు అవసరమని భావిస్తున్నారు.
నేడు అనకాపల్లి డివిజన్కు నోటిఫికేషన్
తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం తొలివిడత అనకాపల్లి డివిజన్లో పంచాయతీ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. డివిజన్లోని 344 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఈ నెల 29 నుంచి 29 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చే నెల ఒకటో తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. తొమ్మిదో తేదీ ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి తరువాత ఎన్నికైన అభ్యర్థిని ప్రకటించ డంతోపాటు ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తిచేస్తారు. రిటర్నింగ్ అధికారుల నియామకం కోసం ఫైలు సిద్ధం చేసి కలెక్టర్కు పంపారు. కలెక్టర్ ఆమోదం అనంతరం మంగళవారం రాత్రిలోగా సంబంధిత అధికారులకు సమాచారం పంపనున్నారు. బుధవారం వీరికి శిక్షణ ఇచ్చి 29వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ బాధ్యతలు అప్పగించనున్నారు. డివిజన్లో 344 పంచాయతీలకు 96 మంది రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), మరో 96 మంది అసిస్టెంట్ ఆర్వోలు అవసరమని గుర్తించారు. వీరితోపాటు 25 శాతం మంది రిజర్వు స్టాఫ్ను నియమిస్తారు. పది వేల ఓటర్లు మించి వున్న పంచాయతీలకు ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. అంతకంటే తక్కువ జనాభా వున్న పంచాయతీలు రెండు, మూడింటికి ఒక ఆర్వో ఉంటారు.