మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు ప్రారంభించండి

ABN , First Publish Date - 2020-07-08T11:16:30+05:30 IST

కందుకూరులోని రెండు పొగాకు వేలం కేంద్రాలలో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రైతులు నిరసనకు

మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు ప్రారంభించండి

పొగాకు రైతుల నిరసన 

కందుకూరుపై వివక్షపై ఆగ్రహం


కందుకూరు, జూలై 7 : కందుకూరులోని రెండు పొగాకు వేలం కేంద్రాలలో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రైతులు నిరసనకు దిగారు. స్థానిక పామూరు రోడ్డులోని కందుకూరు 2 పొగాకు వేలం కేంద్రంలో కొద్దిసేపు వేలాన్ని నిలిపేసి రైతులు నినాదాలు చేశారు. రైతు సంఘం నాయకులు మాదాల రమణయ్య, తాటికొండ రమణయ్య మాట్లాడుతూ తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నప్పటికీ కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో నేటికీ ప్రారంభించకపోవటం అన్యాయమన్నారు.


జిల్లాలోని అనేక వేలం కేంద్రాల్లో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించి వారం రోజులు అయిందన్నారు. కందుకూరులో మాత్రం కనీసం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పకపోవడం అన్యాయమన్నారు. కందుకూరు ప్రాంతం పట్ల జిల్లాలోని పెద్దలు, అధికారులు వివక్ష చూపుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ప్రాంతంలో ఈ ఏడాది వర్షాలవల్ల లోగ్రేడ్‌ పొగాకు అధికంగా దిగుబడులు వచ్చాయని,  మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లలో ప్రథమ ప్రాధాన్యం కందుకూరుకి  ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. లోగ్రేడ్‌, మీడియం గ్రేడ్లకు గిట్టుబాటు ధర లభించక రైతులు పొగాకు బేళ్లను వెనక్కి తీసుకెళ్లాల్సి  వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. 

Updated Date - 2020-07-08T11:16:30+05:30 IST