Srisailam: శ్రీశైలంలో చివరిరోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
ABN , First Publish Date - 2022-10-05T14:09:34+05:30 IST
శ్రీశైలం (Srisailam)లో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు చివరిరోజుకు చేరుకున్నాయి.
నంద్యాల (Nandyala): శ్రీశైలం (Srisailam)లో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు చివరిరోజుకు చేరుకున్నాయి. దసరా సందర్భంగా బుధవారం రుద్రయాగ పూర్ణాహుతి కలశోద్వాసన వసంతోత్సవం పూజలతో మహోత్సవాలు ముగియనున్నాయి. ఈ సాయంత్రం భ్రమరాంబికాదేవి అమ్మవారు నిజాలంకరణ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నందివాహనంపై స్వామి అమ్మవార్లు ఆశీనులై పూజలందుకొనున్నారు. శ్రీ స్వామి అమ్మవారికి ఆలయ ప్రకరోత్సవం జమ్మివృక్షం వద్ద శమీపూజలు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి శ్రీ స్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు పరిసమాప్తి అవుతాయి.
శ్రీశైలం క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు (మంగళవారం) అమ్మవారు సిద్ధిదాయినిగా దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను అశ్వ వాహనంపై ఆశీనులను జేసి విశేష పూజలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలను సమర్పించారు. మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. తరువాత మంత్రి స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.