నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు

ABN , First Publish Date - 2020-04-03T11:04:44+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు గురువారం నిరాడంబరంగా జరిగాయి.

నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు

(రాజాం/రేగిడి/వంగర/పాలకొండ/ఎచ్చెర్ల): కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు గురువారం నిరాడంబరంగా జరిగాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనేది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆలయాలన్నీ మూతపడ్డాయి. దూప, దీప నైవేద్యానికి మాత్రమే పరిమితం అయ్యాయి. కొన్నిచోట్ల ఈ వేడుకలకు దూరంగా ఉండగా మరికొన్నిచోట్ల నామమాత్రంగా నిర్వహించారు. రేగిడి మండలంలో సంకిలి, రేగిడి ఆమదాలవలస, ఖండ్యాం తదితర గ్రామాల్లో ఆలయాలు తెరుచుకోలేదు. రాజాం నగర పంచాయతీ పరిధి వస్త్రపురి కాలనీలో ఉన్న రామమందిరంలో నిరాడంబరంగా ఉత్సవాలు జరిగాయి.


తక్కువ సంఖ్యలో హాజరైన భక్తులు పూజలు చేశారు. అలాగే వంగర మండలంలో వంగర, అరసాడ, బాగెమ్మపేటలలో గల రామమందిరాల్లో వేడుకలు నామమాత్రంగా నిర్వహించారు. పాలకొండలో స్థానిక నక్కలపేటలో షిర్డీసాయి ఆలయంలో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు, ఆలయ అర్చకులు భౌతిక దూరం పాటిస్తూ పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఎచ్చెర్ల మండలంలోని కేశవరావుపేట పంచాయతీ పరిధిలోని లక్ష్ముడుపేట కోదండ రామాలయంలో ధర్మకర్త మెట్ట భూపాలరావు దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు.

Updated Date - 2020-04-03T11:04:44+05:30 IST