పియర్ పళ్లలో కొత్తరకాలు.. కశ్మీర్ వర్సిటీ పరిశోధన!

ABN , First Publish Date - 2020-09-29T22:39:42+05:30 IST

మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పళ్లలో పియర్ ఒకటి. కానీ దీన్ని చాలామంది లైట్ తీసుకుంటారు.

పియర్ పళ్లలో కొత్తరకాలు.. కశ్మీర్ వర్సిటీ పరిశోధన!

శ్రీనగర్: మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పళ్లలో పియర్ ఒకటి. కానీ దీన్ని చాలామంది లైట్ తీసుకుంటారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలన్నింటినీ తీసుకోవాలంటే ఈ పళ్లను కూడా ఓసారి ట్రై చేయకతప్పదు. ఎందుకంటే ఈ పియర్ పళ్లలో చాలా ఆరోగ్యదాయక లక్షణాలున్నాయి మరి.


పచ్చగా, చూడటానికి యాపిల్‌ పండును పోలి ఉండే పియర్.. తింటే మాత్రం కొంచెం వగరుగా ఉంటుంది. అందుకే దీన్ని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఈ పండు వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలుంటాయి. దీనిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీంతో మన జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అంతేకాదు ఈ పండు తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు 52శాతం తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది కూడా. స్త్రీలకు కూడా ఈ పళ్ల వల్ల చాలా ఉపయోగాలున్నాయి.


ఈ పియర్ పళ్లు ఎక్కువగా జమ్మూకశ్మీర్‌లో పండుతాయి. లద్దాఖ్, కశ్మీర్ తదితర ప్రాంతాల్లో వీటిని విరివిగా పండిస్తారు. ఈ ప్రాంతాల్లో యాపిల్ తర్వాత అంతగా పండించేది వీటినే. అయితే వీటి రుచి బాగోదని చాలామంది వీటిని ఎవాయిడ్ చేస్తారు. ఈ సమస్యకు జమ్మూలోని షేర్-ఈ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు పరిష్కారం కనుగొన్నారు.


పియర్ పళ్లపై పరిశోధనలు చేసిన షేర్-ఈ-కశ్మీర్ పరిశోధకులు.. వగరుగా ఉండే ఈ పళ్లలో తీయదనాన్ని పెంచారు. తీపితోపాటు వీటి సైజు కూడా పెరిగేలా కొన్ని జన్యుపరమైన మార్పులు చేశారు. తాము కొత్తగా నాలుగు రకాల పియర్ పళ్లను తయారు చేసినట్లు వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. తాము తయారుచేసిన పళ్లరకాలు మార్కెట్లో దొరకవని, అందుకే వీటికి బాగా డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు.


తాము తయారు చేసిన పియర్ పళ్లు చాలా రుచిగా ఉంటాయని, పోషకాలు కూడా ఎక్కువగా ఉండేలా వీటిని తయారుచేసినట్లు వర్సిటీ నిపుణులు వెల్లడించారు. సాధారణంగా పియర్ పళ్లకు తెగులు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అయితే ఈ ప్రమాదాన్ని కూడా తగ్గించేలా తాము జాగ్రత్తలు తీసుకున్నామని వాళ్లు చెప్పారు. డెన్సిటీ ప్లాంటింగ్ విధానంలో ఈ పళ్లను పండించామని, దీనివల్ల దిగుమతి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వివరించారు.


నాలుగేళ్లుగా ఈ కొత్తరకం పియర్ పళ్లు పెంచుతున్నా, ఎటువంటి సమస్యలూ తలెత్తలేదట. ప్రస్తుతం హెక్టారుకు 25మెట్రిక్ టన్నుల పియర్ పళ్ల దిగుబడి వస్తోందని, మరి కొన్నేళ్లలో ఇది 45మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశం ఉందని వర్సిటీ పరిశోధకులు చెప్పారు. వర్సిటీలోని తమ తోటలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువత కూడా వస్తున్నారని, అలాగే పియర్ సాగుపై ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. వర్సిటీ నుంచి ఈ కొత్తజాతి పియర్ మొక్కలను తీసుకెళ్లి సాగు చేయడానికి యువత ఉత్సాహం చూపుతున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-29T22:39:42+05:30 IST