ఏడీఆర్ఎం (ఆపరేషన్స్)గా శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-01-19T06:32:13+05:30 IST
బెజవాడ అడిషనల్ డివిజినల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం - ఆపరేషన్స్)గా ఎం.శ్రీకాంత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.
విజయవాడ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : బెజవాడ అడిషనల్ డివిజినల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం - ఆపరేషన్స్)గా ఎం.శ్రీకాంత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీకాంత్ 1998 బ్యాచ్ ఇండియన్ రైల్వే సర్వీసు మెకానికల్ ఇంజనీరింగ్ (ఐఆర్ఎస్ఎంఈ) అధికారి. దక్షిణ తూర్పు కోస్తా రైల్వే జోన్ చీఫ్ రోలింగ్ స్టాక్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై ఏడీఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాంత్ ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1995లో మద్రాస్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. రైల్వేస్లో మొదట గుంతకల్ డివిజన్లో అసిస్టెంట్ డివిజినల్ మెకానికల్ ఇంజనీర్గా పని చేశారు. విజయవాడ డివిజన్లో సీనియర్ డివిజినల్ సేఫ్టీ ఆఫీసర్, సీనియర్ డివిజినల్ ఎన్విరాన్మెంటల్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజర్గా పనిచేశారు. రాయనపాడు వర్క్షాప్లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా పని చేశారు. ఆయన పనిచేస్తున్న కాలంలోనే రాయనపాడు రైల్వే వర్క్షాప్ ఐఎస్వో హోదా అందుకుంది.