శ్రీశ్రీ, కందుకూరి, గురజాడలది విశిష్ట స్థానం

ABN , First Publish Date - 2022-05-23T06:02:11+05:30 IST

తెలుగు సాహిత్యంలో మహాకవి శ్రీశ్రీ, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ వేంకట అప్పారావులది విశిష్టస్థానమని ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ఆచార్య తుమ్మల రామకృష్ణ అన్నారు.

శ్రీశ్రీ, కందుకూరి, గురజాడలది విశిష్ట స్థానం

ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌


కర్నూలు(కల్చరల్‌), మే 22:
తెలుగు సాహిత్యంలో మహాకవి శ్రీశ్రీ, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ వేంకట అప్పారావులది విశిష్టస్థానమని ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ఆచార్య తుమ్మల రామకృష్ణ అన్నారు. ఆదివారం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కవులు, కళాకారుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామకృష్ణను కవులు, కళాకారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భం గా ఆచార్య రామకృష్ణ మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన అనేక మార్పులను విశ్లేషించారు. తెలుగు భాషలో ముద్రణ రాకముందు జ్ఞాపకం పెట్టుకోవడానికి చందోబద్ధమైన రచనలు వచ్చాయని చెప్పారు. ఆధునిక యుగంలో వచన సాహిత్యం అందరికీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సాహిత్యాన్ని మలుపు తిప్పిన మహాకవుల్లో శ్రీశ్రీ, కందుకూరి, గురజాడల పాత్ర విశిష్టమైనదని అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ఆచార్య తుమ్మల రామకృష్ణ ఉద్యోగ ప్రస్థానం కరూనలు నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కవులు, కళాకారులు ఎస్‌ఎండీ ఇనాయతుల్లా, వెంకటేశ్వరరెడ్డి, క్రిస్టఫర్‌, నంది అవార్డు గ్రహీతలు వన్నెం బలరాం, పాండురంగయ్య, సామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-05-23T06:02:11+05:30 IST