క్రీడలు మానసికోల్లాసానికి దోహదం
ABN , First Publish Date - 2022-08-19T04:54:17+05:30 IST
క్రీడలు దేహదారుఢ్యానికి, మానసికోల్లాసానికి దోహద పడతాయని
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 18 : క్రీడలు దేహదారుఢ్యానికి, మానసికోల్లాసానికి దోహద పడతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్స వాల్లో భాగంగా గురువారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాచకొండ పోలీసులు, జిల్లా యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటలు పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ భావితరాలకు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ రాష్ట్రంలో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్రీడమ్ కప్లో భాగంగా గెలుపొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతిపిత జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా విద్యార్థులకు ‘గాంధీజీ’ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, దయానంద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచిత శ్రీధర్, రాష్ట్ర ఒలంపిక్ కార్యదర్శి జగదీష్యాదవ్, జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కోట్లాది రూపాయలతో రోడ్ల విస్తరణ
మహేశ్వరం, ఆగస్టు 18 : మహేశ్వరం మండలంలో కోట్లాది రూపాయల నిధులతో ప్రధాన రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నామని విద్యాశాఖమంత్రి పి. సబితాఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఎంపీపీ కె.రఘుమారెడ్డి అధ్యక్షతన మహేశ్వరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. త్వరలో మహేశ్వరం సివిల్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసదుపాయాలతోపాటు పోస్టుమార్టం కేంద్రం, ఆక్సిజన్ ప్లాంటు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వ్యవసాయ శాఖ సమీక్షపై సభ్యులు సుదర్శన్ యాదవ్, సర్పంచులు చంద్రయ్య, శ్రీశైలం, శంకర్ మాట్లాడుతూ.. మండలంలో పశువైద్యశాలలో మందుల కొరత ఉందని తెలిపారు. మంత్రి స్పందించి గ్రామాల్లో పశువులకు కావాల్సిన మందుల సరఫరాలో ఇబ్బంది ఉంటే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని మండల పశు వైద్యాధికారులను ఆదేశించారు. మహేశ్వరం మండలంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయని పోరండ్ల సర్పంచ్ శకుంతల తెలిపారు. గ్రామాల్లో బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో నీటి బిల్లు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, ఆధారాలు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీ కె. రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునిత అంద్యానాయక్, తహసీల్దార్ ఆర్పి. జ్యోతి, ఎండీవో బి. నర్సింహులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
కందుకూరు, ఆగష్టు 18: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. గురువారం కొత్తగూడ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ సాధ మల్లారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి నగరంలోని మంత్రి నివాసంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎనిమిదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు, అండర్డ్రైనేజీలతోపాటు శ్మశాన వాటికలు, డంపింగ్యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. మండల కేంద్రానికి అతిసమీపంలో ఉన్న కొత్తగూడ గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, నాయకులు దామోదర్రెడ్డి, లోకేశ్వర్రెడ్డి, బాల్రెడ్డి, బి.ప్రభాకర్రెడ్డి, మక్తాల వెంకటే్షగౌడ్, ఎస్.శేఖర్గౌడ్, సత్యనారాయణరెడ్డి, బొక్క దీక్షీత్రెడ్డి, కుమ్మరి కృష్ణయ్య, పి.సుధాకర్రెడ్డి, ఎస్.శంకర్గౌడ్, బొక్క ప్రతా్పరెడ్డి, ఏ.కృష్ణగౌడ్, కె.అంజయ్య, శేఖర్రెడ్డి, కుంచకూరి వెంకటే్షగుప్త పాల్గొన్నారు.