ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST
ప్రతిఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని,
మహేశ్వరం, ఆగస్లు 16 : ప్రతిఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని, గ్రామ దేవతలకు ఎంతో ప్రత్యేకత ఉందని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిరాల, సర్ధార్నగర్ ప్రాంతాల్లో ఉన్న శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ బోనాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రావిరాల గ్రామ మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల ఉత్సవాల్లో శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాలు, యువతీయువకులు కేరింతలు, పోతురాజుల విన్యాసాలు అలరించాయి. ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డిగల్ల రత్నం, నాయకులు జెల్లల లక్ష్మయ్య, బాట సురేష్, కాటం భాస్కర్ పాల్గొన్నారు.