తిరుపతి-సికింద్రాబాదు-కరీంనగర్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు
ABN , First Publish Date - 2021-01-23T05:25:34+05:30 IST
తిరుపతి- సికింద్రాబాదు- కరీంనగర్ మధ్య మరికొన్ని ప్రత్యేక వారాంతపు రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు.
తిరుపతి(ఆటోనగర్), జనవరి 22: తిరుపతి- సికింద్రాబాదు- కరీంనగర్ మధ్య మరికొన్ని ప్రత్యేక వారాంతపు రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈనెల 26, 27, 29వ తేదీల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాదు నుంచి రెండు వేర్వేరు మార్గాల్లో నడుస్తాయన్నారు.
తిరుపతి- సికింద్రాబాదు మధ్య నడిచే ప్రత్యేకరైలు (02732) ప్రతి బుధ, శనివారాల్లో సికింద్రాబాదులో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి రాయచూరి, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, పాకాల మీదుగా మరుసటి రోజు ఉదయం తిరుపతికి చేరుతుంది. ఈ ప్రత్యేకరైలు (02731) అదే రోజు సాయంత్రం 5గంటలకు తిరుపతిలో బయల్దేరి వచ్చిన మార్గంలోనే వెళుతుంది. ఇలా ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతి నుంచి ఈ రైలు నడుస్తుంది.
అలాగే, ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 5.40గంటలకు మరో ప్రత్యేక రైలు(02770) సికింద్రాబాదులో బయల్దేరి కాచిగూడ, కర్నూలు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, పాకాలమీదుగా మరుసటి రోజు ఉదయం తిరుపతికి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి నుంచి సోమ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3.40గంటలకు ఈ ప్రత్యేక రైలు (02769) బయల్దేరుతుంది.
ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 8.15 గంటలకు మరో ప్రత్యేకరైలు (02761) తిరుపతిలో బయల్దేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరంగల్ మీదుగా కరీంనగర్కు మరుసటిరోజు ఉదయం చేరుకుంటుంది. కరీంనగర్లో ప్రతి గురు, ఆదివారాల్లో సాయంత్రం 7.15 గంటలకు ఈ ప్రత్యేక రైలు (02762) తిరుపతికి బయలుదేరుతుంది.