ఆయుధాలపై అవగాహన అవసరం
ABN , First Publish Date - 2020-10-23T11:33:10+05:30 IST
విద్యార్థులు చిన్నతనం నుంచే ఆయుధాలపై అవగాహన కల్పించుకోవాలని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు అన్నారు.
ఓపెన్హౌస్లో అదనపు ఎస్పీ సుబ్బరాజు
ఏలూరు క్రైం, అక్టోబరు 22 : విద్యార్థులు చిన్నతనం నుంచే ఆయుధాలపై అవగాహన కల్పించుకోవాలని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు అన్నారు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. దీనివల్ల భావి భారత పౌరులుగా దేశ రక్షణకు వారి సేవలు వినియోగించవచ్చునన్నారు. పోలీసులు ఆయుధాలను వినియోగించడం కూడా ఎంతో శ్రమతో కూడుకున్నదని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఎం.మహేశ్కుమార్ మాట్లాడుతూ ఓపెన్ హౌస్ వల్ల పోలీసులు వినియోగించే ఆయుధాల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన తెలుస్తుందన్నారు.
బాంబు డిస్పోజల్ టీమ్, ఫింగర్ ప్రింట్, పోలీస్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్స్, నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్స్క్వాడ్ బృందాలు, ఆయుధాలు వాటి విడి భాగాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పోలీసు జాగిలం ఏ రకంగా నేరస్తులను గుర్తిస్తుందో, పేలుడు పదార్థాలను ఎలా గుర్తిస్తుందో వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ జీవీ కృష్ణారావు, ఏఆర్ఆర్ఐలు ఎం.మనోహర్, కృష్ణంరాజు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ మాధవీలత, డీసీపీవో సూర్య చక్రవేణి, పోలీసు అధికార సంఘ అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.