కరోనా టీకా సరఫరా చేసేందుకు ‘సీరం’కు దక్షిణాఫ్రికా అనుమతి..!
ABN , First Publish Date - 2021-01-24T03:12:58+05:30 IST
దక్షిణాఫ్రికాకు కరోనా టీకా సరఫరా చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది.
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాకు కరోనా టీకా సరఫరా చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం నాడు కీలక ప్రకటన చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అంతకుమునుపు..మంత్రి ఆ దేశ పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేశారు. జనవరి నెలాఖరుకు సీరం మొత్తం 10 లక్షల టీకాలు సరఫరా చేస్తుందని, ఫిబ్రవరిలో మరో 5 లక్షల డోసులను అందిస్తుందని తెలిపారు.
‘కరోనా టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్నాయి. టీకా సరఫరాకు సంబంధించి పలు వ్యక్తులు, సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మునపటి కరోనా స్ట్రెయిన్తో పాటూ కొత్త స్ట్రెయిన్ కూడా చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాలు కొత్త స్ట్రెయిన్ కూడా అడ్డుకోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.