భార్యను విసిగించాడని తండ్రిని కొట్టి చంపేశాడు..!
ABN , First Publish Date - 2021-06-08T18:15:19+05:30 IST
పెద్దకొడుకు సలావుద్దీన్ ఆదివారం బయటకు వెళ్లడంతో తన భార్యను
హైదరాబాద్ సిటీ/కూకట్పల్లి : కుటుంబ సభ్యులను తరచూ వేధిస్తున్నాడన్న కారణంతో మతి స్థిమితంలేని తండ్రిని కొడుకే కర్రతో కొట్టి చంపేశాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫ్దార్నగర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం.... కూకట్పల్లి రాజీవ్గాంధీనగర్ సమీపంలోని సఫ్దార్నగర్లో నివాసముండే ఎండీ.ఇంతియాజ్ ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మానసికపరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి సలావుద్దీన్, బుర్రానుద్దీన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సలావుద్దీన్ ప్రైవేటు ఉద్యోగిగా, బుర్రానుద్దీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కాగా ఇంతియాజ్కు మానసికస్థితి సక్రమంగా లేకపోవడంతో కొంతకాలంగా ఇంట్లోని కుటుంబ సభ్యులను కారణంగా లేకుండానే ఇబ్బంది పెట్టడం, కొట్టడం వంటివి చేస్తున్నాడు.
ఇదిలాఉంటే పెద్దకొడుకు సలావుద్దీన్ ఆదివారం బయటకు వెళ్లడంతో తన భార్యను ఇంతియాజ్ విసిగించాడు. దీంతో అర్ధరాత్రి ఇంటికి వచ్చిన సలావుద్దీన్కు భార్య జరిగిన విషయం చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన సలావుద్దీన్ ఇంట్లో కర్ర తీసుకొని గదిలో నిద్రిస్తున్న తండ్రి ఇంతియాజ్ తలపై బలంగా కొట్టాడు. కుటుంబ సభ్యులు అడ్డుపడి... తీవ్రగాయాలైన ఇంతియాజ్ను సనత్నగర్లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా... అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నకొడుకు బుర్రానుద్దీన్ ఫిర్యాదు మేరకు సలావుద్దీన్పై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.