కన్నతండ్రినే కడతేర్చిన కొడుకు.. ఇంతకీ వారి మధ్య గొడవకు కారణమేంటో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2022-02-25T05:42:38+05:30 IST
వారిద్దరూ తండ్రీకొడుకులు. ఇద్దరూ రోజుకూలీలుగా పనిచేస్తుంటారు. బుధవారం వారిద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ గొడవలో తండ్రిని కొడుకు కత్తితో పొడిచి చంపేశాడు. ఒక బీడీ వారి మధ్య గొడవకు కారణమైంది...
వారిద్దరూ తండ్రీకొడుకులు. ఇద్దరూ రోజుకూలీలుగా పనిచేస్తుంటారు. బుధవారం వారిద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ గొడవలో తండ్రిని కొడుకు కత్తితో పొడిచి చంపేశాడు. ఒక బీడీ వారి మధ్య గొడవకు కారణమైంది. బీడీ అడిగితే ఇవ్వలేదనే కోపంతో కన్నతండ్రిని కొడుకు హతమార్చాడు.
వివరాల్లోకి వెళితే.. అసోంలోని బార్పేట్కు చెందిన లాల్మియా (50) అనే వ్యక్తి తన కొడుకు సమ్సూల్ హక్(30)తో కలిసి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. బుధవారం ఉదయం లాల్మియా బీడీ కాలుస్తుండగా అతడి వద్దకు వెళ్లిన సమ్సూల్ ఒక బీడీ అడిగాడు. లాల్మియా అతడికి బీడీ ఇచ్చాడు. అది కాల్చేసిన అనంతరం సమ్సూల్ తండ్రిని మరో బీడీ అడిగాడు.
రెండో బీడీ ఇచ్చేందుకు లాల్మియా ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ ఘర్షణలో లాల్మియాను సమ్సూల్ ఓ పదునైన కత్తితో పొడిచేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో లాల్మియా అక్కడికక్కడే చనిపోయాడు. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమ్సూల్ను అరెస్ట్ చేశారు.