కారును ఢీకొన్న బస్సు తండ్రీకొడుకుల దుర్మరణం
ABN , First Publish Date - 2021-02-26T07:07:33+05:30 IST
కుప్పం -వి.కోట ప్రధాన రహదారి గణేష్పురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వి.కోట మండలం పట్రపల్లెకు చెందిన తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు.
వి.కోట/గుడుపల్లె, ఫిబ్రవరి 25: కుప్పం -వి.కోట ప్రధాన రహదారి గణేష్పురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వి.కోట మండలం పట్రపల్లెకు చెందిన తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. వి.కోట మండలం పట్రపల్లెకు చెందిన కాంతప్ప(40) గురువారం ఉదయం అనారోగ్యంతో ఉన్న తండ్రి సుబ్బన్న(65)ను కారులో కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం తిరిగి పట్రపల్లెకు బయలుదేరారు. గణేష్పురం సమీపంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు వారి కారును ఢీకొంది. కారు నుజ్జయి తండ్రీకొడుకులిద్దరూ కారులోనే చనిపో యారు. స్థానికులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోలీసులు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణం బంధువుల రోదనలతో నిండిపోయింది. గుడుపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బస్సు డ్రైవర్ పరారయ్యాడు.
చంద్రబాబు దిగ్భారంతి
వి.కోట మండలం పట్రపల్లెకు చెందిన సీబీఎన్ ఆర్మీ సభ్యుడు కాంతప్ప, అతని తండ్రి సుబ్బన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గుడుపల్లె పర్యటనలో ఉన్న ఆయన ప్రమాద విషయం తెలుసుకుని వారి మృతి పట్ల ప్రగాఢసంతాపం వ్యక్తం చేశారు. కాంతప్ప కుటుంబాన్ని పార్టీ అన్నివిధాలా ఆదుకుంటుందని వారి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.