సోషల్‌, డిజిటల్‌ మీడియాకు.. లక్ష్మణ రేఖలు

ABN , First Publish Date - 2021-02-26T08:55:52+05:30 IST

సామాజిక మాధ్యమాలను కట్టడి చేసే కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కొత్త నియమావళి ప్రకారం.. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే

సోషల్‌, డిజిటల్‌ మీడియాకు..  లక్ష్మణ రేఖలు

మూడంచెల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటుకు సూచన

నగ్న, మార్ఫింగ్‌ చిత్రాలను 24 గంటల్లో తొలగించాలి

దేశ సమగ్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలను మొదటగా పోస్ట్‌ చేసిన వారిని గుర్తించాలి

15 రోజుల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాలి..

డిజిటల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకూ నిబంధనలు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: సామాజిక మాధ్యమాలను కట్టడి చేసే కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కొత్త నియమావళి ప్రకారం..  దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే వ్యాఖ్యలను 24 గంటల్లో తొలగించడంతో పాటు.. వాటిని మొదటిగా చేసిన వ్యక్తి ఎవరో గుర్తించాల్సిన బాధ్యత సోషల్‌ మీడియా సంస్థలదే. అలాగే, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీలను నియంత్రించే నిబంధనలను కూడా కేంద్రం రూపొందించింది. డిజిటల్‌ మీడియాలో పారదర్శకత, జవాబుదారీ తనం లోపించడం.. వినియోగదారుల హక్కులపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సంబంధిత వర్గాలన్నింటితో చర్చలు జరిపి ఈ నియమావళిని రూపొందించినట్టు కేంద్ర మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. ‘‘సోషల్‌ మీడియా సంస్థలు భారత దేశంలో వ్యాపారం చేయడాన్ని, లాభాలు ఆర్జించడాన్ని స్వాగతిస్తాం.


కానీ, ఆయా సంస్థలు రాజ్యాంగాన్ని, మన దేశ చట్టాలను గౌరవించాలి. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు.. సాధారణ వినియోగదారులకు తమ సృజనాత్మకతను ప్రదర్శించుకునే, ప్రశ్నించే, తమ అభిప్రాయాలను పంచుకునే, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను విమర్శించే అవకాశాన్ని వారికిచ్చాయి. అయితే, ఈ క్రమంలో ఆయా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత సోషల్‌ మీడియా సంస్థలదే. సోషల్‌ మీడియాను వాడుకునే సాధారణ వినియోగదారులకు ఈ కొత్త నిబంధనలు సాధికారతనిస్తాయి. వారి ఫిర్యాదులను పట్టించుకుని సకాలంలో పరిష్కరించే ఒక వ్యవస్థను రూపొందిస్తాయి.’’ అని పేర్కొన్నారు. ఇక.. ‘‘వదంతులను ప్రచారం చేసే హక్కు డిజిటల్‌ మీడియా వెబ్‌సైట్లకు లేదు. మీడియాకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. కానీ.. కొన్ని సహేతుకమైన పరిమితులతో’’ అని జావడేకర్‌ వ్యాఖ్యానించారు.


రెండు రకాలు..

కొత్త నియమావళి ప్రకారం కేంద్రం సామాజిక మాధ్యమాలను.. వాటి వినియోగదారుల సంఖ్య ఆధారంగా రెండు రకాలుగా విభజించింది.  తక్కువ వినియోగదారులున్న వాటిని సాధారణ సామాజిక మాధ్యమాలుగా, ఎక్కువ వినియోగదారులున్నవాటిని ప్రముఖ సామాజిక మాధ్యమాలుగా పరిగణిస్తామని పేర్కొంది. రెండు రకాల మాధ్యమాలూ నిబంధనలను పాటించాలి. ప్రముఖ సామాజిక మాధ్యమాలు అదనంగా మరిన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రెండు రకాల మాధ్యమాలూ పాటించాల్సిన నిబంధనలు..


అన్ని రకాల సామాజిక మాధ్యమాలూ తమతమ ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్‌ అయ్యే సమాచారం విషయంలో  జాగరూకతతో ఉండాలి. ఐటీ చట్టం ప్రకారం సామాజిక మాధ్యమాలకు కొన్ని ‘సేఫ్‌ హార్బర్‌ ప్రొవిజన్లు’ ఉంటాయి. అంటే.. ఆయా ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారులు చేసే పోస్టుల బాధ్యత సోషల్‌ మీడియా సంస్థలకు ఉండదు. ఇక నుంచి అలా కుదరదు. జాగ్రత్తగా ఉండకపోతే సేఫ్‌ హార్బర్‌ ప్రొవిజన్‌ వాటికి వర్తించదు.


వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్‌ మీడియా సంస్థలు ఒక అధికారిని నియమించాలి. ఆ అధికారి పేరు, వివరాలు అందుబాటులో ఉంచాలి. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయాన్ని వారికి తెలియజేయాలి. 15 రోజుల్లోగా పరిష్కరించాలి. సోషల్‌ మీడియా వినియోగదారుల.. ముఖ్యంగా మహిళా యూజర్ల ఆన్‌లైన్‌ భద్రతను, గౌరవాన్ని కాపాడాలి. ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లోగా వారిని ఇబ్బంది పెట్టే కంటెంట్‌ను, వారి రహస్య అవయవాలను బహిర్గతం చేసే చిత్రాలు,  శృంగారంలో పాల్గొనే దృశ్యాలు, మార్ఫింగ్‌ చిత్రాలు ఉంటే తొలగించాలి. 


‘అదనపు’ జాగ్రత్తలు..

కేంద్రం విభజించిన ప్రకారం ‘ప్రముఖ సామాజిక మాధ్యమాల’కు మరికొన్ని అదనపు బాధ్యతలు ఇవి..

సోషల్‌ మీడియా సంస్థలు చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం ‘చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారి’ని నియమించాలి.  పోలీసులు, సీబీఐ వంటి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ‘నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌’ను నియమించాలి. ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్‌ గ్రీవన్స్‌ అధికారిని నియమించాలి. వీరంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి. అందుకున్న ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలతోపాటు.. ఫిర్యాదులు రాకముందే తొలగించిన కంటెంట్‌ తాలూకూ వివరాలతో ప్రతి నెలా సవివరమైన నివేదికను సామాజిక మాధ్యమాలు ప్రచురించాలి.


దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి, భద్రతకు సంబంధించిన.. విదేశాలతో సత్సంబంధాలను దెబ్బతీసే.. అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన.. కంటెంట్‌ను ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశించిన 24 గంటల్లో తొలగించాలి. వాటిని సామాజిక మాధ్యమాల్లో తొలిసారి పోస్ట్‌  చేసిన వ్యక్తి ఎవరో గుర్తించాలి. ఇది మెసేజింగ్‌ రూపంలో సేవలు అందించే ప్రముఖ సామాజిక మాధ్యమాలకు ముఖ్యం గా వర్తిస్తుంది (అంటే.. వాట్సాప్‌ వంటివాటికి. నిజానికి వాట్సాప్‌ సామాజిక మాధ్యమం కాదు. మెసేజింగ్‌ యాప్‌ మాత్రమే. కానీ, వాట్సాప్‌ ద్వారా దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిబంధన పెట్టారు).


దర్యాప్తు సంస్థల నుంచి లిఖితపూర్వక అభ్యర్థన వస్తే.. వారు అడిగిన సమాచారాన్ని 72 గంటల్లోగా సమర్పించాలి. ఆ రికార్డులను దర్యాప్తు నిమిత్తం 180 రోజులు దాచి ఉంచాలి. ప్రముఖ సామాజిక సంస్థలు భారతదేశంలో తమ కార్యాలయం చిరునామాను వెబ్‌సైట్‌లో, యాప్‌లో తప్పనిసరిగా ఇవ్వాలి.


తమ ఖాతాలను ధ్రువీకరించడానికి సిద్ధమయ్యే వారికోసం ‘వాలంటరీ యూజర్‌ వెరిఫికేషన్‌ మెకానిజమ్‌’ను రూపొందించాలి. వినియోగదారులు చేసిన పోస్టును తొలగించే ముందు.. వారి వాదన చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. అయినప్పటికీ ఆ సమాచారాన్ని తొలగించాలనుకుంటే ఆ విషయాన్ని వారికి ముందు గా తెలపాలి.  దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే.. విదేశాలతో సత్సంబంధాలను దెబ్బతీసే అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలంటూ కోర్టు ఆదేశించినప్పుడు.. ప్రభుత్వ వ్యవస్థలు కోరినప్పుడు అలాంటి నిషేధిత సమాచారాన్ని తొలగించాలి. సామాజిక మాధ్యమాలకు సంబంధించిన నిబంధనలు గెజెట్‌లో ప్రచురితమైనప్పటి నుంచి అమల్లోకి వస్తాయి. ప్రముఖ సామాజిక మాధ్యమాలు అదనంగా పాటించాల్సిన నిబంధనలు గెజెట్‌లో ప్రచురితమైన 3 నెలల తర్వాత అమల్లోకి వస్తాయి.


డిజిటల్‌ మీడియా నిబంధనలు..

డిజిటల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు రూపొందించిన ఎథిక్స్‌ కోడ్‌ ప్రకారం..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తాము ప్రసారం చేసే కంటెంట్‌ను వయసు ఆధారంగా ఐదు కేటగిరీలుగా విభజించాలి. అవి.. అన్ని వయసులవారూ చూడదగ్గవి (యు), ఏడేళ్లు, అంతకుమించి వయసున్నవారు చూడగలిగే యూఏ 7+ చిత్రాలు, యూఏ 13+, యూఏ 16+, పెద్దలే చూడాల్సిన ఏ కేటగిరీ. ఇంట్లో పిల్లలు చూడకుండా చేసే పేరెంటల్‌ లాక్‌ను, వయసు ధ్రువీకరించుకునే విధానాలను అందుబాటులోకి తేవాలి. 


ఆన్‌లైన్‌ క్యూరేటెడ్‌ కంటెంట్‌ పబ్లిషర్లు (వివిధ సోర్సుల నుంచి సేకరించిన సమాచారానికి తమదైన వ్యాఖ్యానాన్ని జోడించి తమ యూట్యూబ్‌ చానల్‌ ద్వారానో, ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారానో ఆన్‌లైన్‌లో పబ్లిష్‌ చేసేవారు) ఆ కంటెంట్‌ ఏ విభాగంలోకి వస్తుందో ముందే తెలపాలి. నిర్ణీత వయసులవారు మాత్రమే వాటిని చూడాలనే సూచన ముందుగానే చేయాలి. డిజిటల్‌ మీడియా పబ్లిషర్లు.. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిబంధనలను పాటించాలి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. 




ఏ ప్లాట్‌ఫామ్‌.. ఎంత మంది యూజర్లు..

కేంద్ర ఐటీ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో.. వాట్సాప్‌, యూట్యూబ్‌ తదితర ప్లాట్‌ఫామ్‌లకు మనదేశంలో ఎంత మంది వినియోగదారులున్నారనే గణాంకాలను వెల్లడించింది. దాని ప్రకారం..


సహేతుక పరిమితులైతే ఓకే!

కొందరు నిపుణుల అభిప్రాయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త నియమావళిపై న్యాయనిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం విధించిన పరిమితులు రాజ్యాంగంలోని 19వ  అధికరణానికి  లోబడి ఉంటే చెల్లుతాయని కొందరు న్యాయనిపుణులు పేర్కొన్నారు. ఏదేమైనా సోషల్‌ మీడియా సంస్థలు భారత చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని.. వాటిని నియంత్రించే హక్కు ప్రభుత్వానికి ఉందని చెబుతున్నారు. మరికొందరేమో.. అసలు ఈ నిబంధనలు రాజ్యాంగం ప్రసాదించిన వాక్స్వాతంత్ర్యానికి, వ్యక్తిగత గోప్యతకు భంగమని తేల్చిచెబుతున్నారు.   సోషల్‌ మీడియా సంస్థలు భారత చట్టాలకు కట్టుబడి పనిచేయాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. కొత్త నిబంధనలు వినియోగదారులకు సాధికారతనిస్తాయని తెలిపారు. ఇక.. కొత్త నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని ఫేస్‌బుక్‌ సంస్థ పేర్కొంది. సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌పై కేంద్రం రూపొందించిన కొత్త నియమావళిని స్వాగతిస్తున్నామని బీజేపీ నేత విజయశాంతి తెలిపారు.

Updated Date - 2021-02-26T08:55:52+05:30 IST