స్మగ్లర్‌తో కొవిడ్‌ కేంద్రం ఉద్యోగి కుమ్మక్కై...!

ABN , First Publish Date - 2022-06-03T20:26:53+05:30 IST

స్మగ్లర్‌తో కొవిడ్‌ కేంద్రం ఉద్యోగి కుమ్మక్కై...!

స్మగ్లర్‌తో కొవిడ్‌ కేంద్రం ఉద్యోగి కుమ్మక్కై...!

  • ఎయిర్‌పోర్టులో 3.14 కిలోల బంగారం పట్టివేత


హైదరాబాద్ సిటీ/శంషాబాద్‌ రూరల్‌ : అక్రమంగా తరలిస్తున్న రూ. 1.65 కోట్ల విలువైన బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టులోని కొవిడ్‌ కేంద్రంలో పనిచేస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగి ఓ స్మగ్లర్‌తో కలిసి కొన్నాళ్లుగా అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానం (ఏఐ952)లో వచ్చిన ఓ వ్యక్తిపైౖ కస్టమ్స్‌ అధికారులకు అనుమానం రావడంతో నిఘా పెట్టారు. అతడు నేరుగా కొవిడ్‌ కేంద్రానికి వెళ్లి అక్కడ చెత్తబుట్టలో ప్లాస్టిక్‌ కవర్‌ వేసినట్లు సీసీ కెమెరాల ద్వారా గమనించారు.


అతడిని అదుపులోకి తీసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ స్వాధీనం చేసుకున్నారు. అందులో 12 చిన్న చిన్న ప్యాకెట్లలో ఉన్న 3.14 కిలోల బంగారం ఉంది. కొన్ని ప్యాకెట్లలో నగలు, మరికొన్నింటిలో బిస్కెట్లు, పేస్టు చేసిన రూపంలో బంగారం ఉంది. కొవిడ్‌ కేంద్రంలో పనిచేసే ఉద్యోగి ఈ బంగారాన్ని దొడ్డిదారిన ఎయిర్‌పోర్టు బయటకు తీసుకొచ్చి స్మగ్లర్‌కు అప్పగిస్తున్నట్లు తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి కస్టమ్స్‌ కార్యాలయానికి తరలించారు.

Updated Date - 2022-06-03T20:26:53+05:30 IST