భార్యే కడతేర్చింది

ABN , First Publish Date - 2020-10-31T08:59:31+05:30 IST

ఓ భార్య తన ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఎవరికీ అనుమానం రాకుండా చున్నీతో ఉరేసి ఫ్యాన్‌కు వేలాడిదీసి ఆత్మహత్యగా చిత్రీకరించింది.

భార్యే కడతేర్చింది

 భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ

ప్రియుడితో కలసి ఘాతుకం

 నిందితుల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు


కొత్తూరు రూరల్‌, అక్టోబరు 30: ఓ భార్య తన ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఎవరికీ అనుమానం రాకుండా చున్నీతో ఉరేసి ఫ్యాన్‌కు వేలాడిదీసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం బయటపడింది. హత్యకు పాల్పడిన భార్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... కొత్తూరు మండల కేంద్రంలోని రెల్లివీధికి చెందిన దూళి రాము(35) అనే వ్యక్తి ఈ నెల 26న అను మానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన భర్త చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు రాము భార్య కుమారి స్థానికులను నమ్మించింది. దీంతో రాము తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వై.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలడంతో కుమారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో ప్రియుడు సతీష్‌తో కలసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. రాముకు టెక్కలికి చెందిన కుమారితో పదేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి  ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కుమారికి అదే వీధికి  చెందిన సొండి సతీష్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి.  దీనిపై నెల రోజుల కిందట స్థానిక పోలీసు స్టేషన్‌లో భార్యభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భర్త  అడ్డుతొలగించుకునేందుకు కుమారి ప్లాన్‌ వేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడు సతీష్‌తో కలసి  భర్తను హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కలసి రాము మెడకు చున్నీని బిగించి ఇంట్లో ఉన్న ఫ్యానుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కుమారి, సతీష్‌లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-10-31T08:59:31+05:30 IST