వేర్వేరు దొంగతనాల కేసుల్లో ఆరుగురి అరెస్టు
ABN , First Publish Date - 2020-06-30T10:33:46+05:30 IST
నగరంలోని వేర్వేరు దొంగతనాల కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసి, 47 గ్రాముల బంగారు నగలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు
కడప (క్రైం), జూన్ 29: నగరంలోని వేర్వేరు దొంగతనాల కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసి, 47 గ్రాముల బంగారు నగలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో తాలుకా సీఐ నాగభూషణం, రిమ్స్ సీఐ సత్యబాబుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల 24న మల్లె వినయకుమార్ అలియాస్ వినయ్ కడప నగరం చెమ్ముమియాపేటలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి 5 తులాల బంగారు నగలు చోరీచేశాడు. బాధితురాలు రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేసి 47 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
కాగా వినయకుమార్ అత్యాచారం కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే రామాంజనేయపురంలో గుండంశెట్టి నాగరాజుకు చెందిన ట్రాక్టరు ట్రాలీని ఈ నెల 15న శాంతినగర్కు చెందిన టి.నరసింహ, చలమారెడ్డిపల్లెకు చెందిన టి.వెంకటేశ్, గంపా వెంకటేశ్ కలిసి చోరీ చేశారు. ఈ నెల 25న నాగిరెడ్డి క్రిష్ణారెడ్డికి చెందిన వాటర్ ట్యాంకర్ను కూడా ఈ ముగ్గురూ చోరీ చేసి విక్రయించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను, వాహనాలను కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.4 లక్షల విలువ చేసే ట్రాక్టరు ట్రాలీ, వాటర్ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నారు.