శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-03-04T07:13:05+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 13 వరకూ నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోరారు.

శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్‌

మంత్రి సురేష్‌

వివిధ శాఖల అధికారులతో సమీక్ష

సమన్వయంతో పనిచేయాలని సూచన

త్రిపురాంతకం, మార్చి 3 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 13 వరకూ నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోరారు. బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో ఉత్సవ ఏర్పాట్లపై బుధవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉత్సవాలకు లక్షమందికిపైగా భక్తులు వస్తారని అన్నారు. కొండపైకి వెళ్లేందుకు వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఉచిత మినీబస్సులను ఏర్పాటుచేయాలని సూచించారు. పార్కింగ్‌, ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా చూడాలన్నారు. వంతెన వద్ద ఎస్‌ఐ స్థాయి అధికారులు ట్రాఫిక్‌ను పర్యవేక్షించాలని, సాగర్‌ కాలువ వద్ద మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా స్నానాల గదులు, బారికేడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్‌ఈడీ తెరలు, విద్యుత్‌ అలంకరణ ఉన్నందున విద్యుత్‌ సమస్యలు రాకుండా చూడాలని,  అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులు కలిసి మంచినీటిని సరిపడా సరఫరా చేయాలని, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, బ్లీచింగ్‌, సున్నం అందుబాటులో ఉంచాలన్నారు. బయో టాయిలెట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అత్యవసర వసతుల కోసం రూ.10లక్షలు మంజూరుకు కలెక్టర్‌ను కోరాలని ఆర్డీవో శేషిరెడ్డికి మంత్రి సూచించారు. సత్రాల నిర్వాహకులు, దాతలు భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ సరఫరా చేయాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.  అనంతరం ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్‌, డీఎల్‌డీవో సాయికుమార్‌, ఈవో కె.సుబ్బరాజు, తహసీల్దారు కిరణ్‌, ఎంపీడీవో సుదర్శనం, ఈవోఆర్డీ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ పి.వెంకటలక్ష్మి, ఆర్టీవో లింగారావు, వైద్యాధికారులు శ్రీనివాసరావు, నాగేశ్వనాయక్‌, ఆర్‌అండ్‌బీ డీఈఈ రమణయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ రామకృష్ణ, పీఆర్‌ ఏఈఈ మహంకాళయ్య వైసీపీ నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, పి.చంద్రమౌళిరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-03-04T07:13:05+05:30 IST