Mamatha Banerjee : ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితి
ABN , First Publish Date - 2021-07-28T21:13:06+05:30 IST
పెగాసస్ వ్యవహారంపై పోరాడడానికి తమ పార్టీ ముందంజలో ఉంటుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
న్యూఢిల్లీ : పెగాసస్ వ్యవహారంపై పోరాడడానికి తమ పార్టీ ముందంజలో ఉంటుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశానికి మమత డుమ్మా కొట్టారు. ఈ విషయంపై ప్రశ్నించగా... పెగాసస్ వ్యవహారంపై పోరాడడానికి తమ పార్టీ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. తన ఫోన్ కూడా హ్యాక్ అయ్యిందని, అందుకే ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానని మండిపడ్డారు. పెగాసస్ జాబితాలో తన పేరు లేకపోయినా, తన ఫోన్ హ్యాక్ అయ్యిందని ఆరోపించారు.‘‘నా ఫోన్ హ్యాక్ అయ్యింది. అభిషేక్ బెనర్జీ, ప్రశాంత్ కిశోర్ ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయి. ఒక్క ఫోన్ హ్యాక్ అయ్యిందంటే చాలు.. అన్ని ఫోన్లూ హ్యాక్ అవుతాయి’’ అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కంటే పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉందని మండిపడ్డారు. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఈ వ్యవహారంపై అందరమూ కలుసుకుంటామని ప్రకటించారు. అయితే ప్రతిపక్ష కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారని ప్రశ్నించగా.... ‘‘నేనేమీ జ్యోతిషురాలిని కాదు.. ఎవరో ఒకరు తెరపైకి వస్తారు. వారికి నేను మద్దతిస్తాను’’ అని మమతా బెనర్జీ ప్రకటించారు.