ఒక్క గింజ పక్కదారి పట్టినా సహించం

ABN , First Publish Date - 2020-11-30T07:00:01+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)కు సంబంధించి ఒక బియ్యం గింజ పక్కదారి పట్టినా సహించేదిలేదని జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.

ఒక్క గింజ పక్కదారి పట్టినా సహించం

  • పీడీఎస్‌ బియ్యం పక్కదారిపై జేసీ సీరియస్‌ 
  • ఐదుగురు డీలర్లపై సస్పెన్షన.. ఇద్దరు అధికారులకు షోకాజ్‌లు
  • పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌  

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), నవంబరు 29: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)కు సంబంధించి ఒక బియ్యం గింజ పక్కదారి పట్టినా సహించేదిలేదని జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలు, గోదాముల్లో ముమ్మర తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. రామచంద్రపురం మండలం తోటపేట ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. ఈ బృందంలో రామచంద్రపురం ఆర్డీవో, సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌, టెక్నికల్‌ ఏఎం, రామచంద్రపురం మండల తహశీల్దార్‌ ఉంటారని జేసీ ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ బృందం.. బియ్యం ఎక్కడి నుంచి ఎలా దారి మళ్లాయనే దానిపై క్షుణ్ణంగా విచారించి నివేదిక సమర్పిస్తుందని వెల్లడించారు. అందులోని అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. పేదల బియ్యం పక్కదారికి సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఐదుగురు డీలర్లను సస్పెండ్‌ చేశామన్నారు. సంబంధిత సహాయ సరఫరా అధికారి, పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్దార్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు. స్టేజ్‌-2 ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టరు, మండల లెవెల్‌ స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జిలకు నోటీసులు ఇచ్చామన్నారు. రెండు మూడు రోజుల్లో వారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి చర్యలు ఉంటాయని జేసీ వెల్లడించారు.

Updated Date - 2020-11-30T07:00:01+05:30 IST