సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి
ABN , First Publish Date - 2022-01-29T05:09:01+05:30 IST
సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.
- రాయలసీమ సాగు నీటి సాధన సమితి
నంద్యాల టౌన్, జనవరి 28: సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నంద్యాలలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడాన్ని సాగునీటి సాధన సమితి స్వాగతిస్తున్నదని అన్నారు. కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లోని శ్రీశైలం రిజర్వాయర్ కింద మునక గ్రామాలకు రోడ్డు కనెక్టివిటితోపాటు హైదరాబాద్ - చెన్నై మధ్యన కీలకమైన ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం కృషి చేసిన తెలు గు రాష్ట్రాల సీఎంలను, తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులను అభినందిస్తున్నామని అన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గతంలోనే కృష్ణానదిపై సిద్ధేశ్వరం వద్ద నిర్మించే బ్రిడ్జితోపాటు అలుగు నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ సీఎంకు విజ్ఞాపన పత్రాలను పంపామని అన్నారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం రాయలసీమ ప్రజల చీరకాల వాంఛ అని, 2016 మే 31న పాలకుల నిర్బంధాల మధ్య సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన విజయవంతంగా పూర్తి చేశామని, ఆ తరువాత రాయలసీమ మహాజన సభ, సిద్ధేశ్వరం వాహన యాత్ర, 100కిలో మీటర్ల పాదయాత్ర ఇలా ఎన్నో అలుగు నిర్మాణం కోసం పోరాట ఉద్యమం చేశామని అన్నారు. ప్రస్తుతం జాతీయ రహదారులను నిర్మించే బ్రిడ్జితోపాటు అలుగు నిర్మించుకునే అవకాశం వచ్చినా సందర్భంలోనైనా రాయలసీమ రాజకీయ నాయకులు మౌనం వీడాలని బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. అలుగు నిర్మాణం కోసం ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి చొరవ చూపాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.