టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌కు షోకాజ్‌ నోటీస్‌

ABN , First Publish Date - 2020-08-09T08:45:39+05:30 IST

అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూములలో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు..

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌కు షోకాజ్‌ నోటీస్‌

జవహర్‌నగర్‌ ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూములలో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన బోర్డులు పెట్టి వాటిని ఆక్రమించుకుంటున్నారని కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ ఇచ్చిన సమాచారం మేరకు మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ శాంతికోటేశ్‌గౌడ్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని మున్సిపల్‌ కమిషనర్‌ నేతి మంగమ్మ, కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ ఆ నోటీసులను కార్పొరేటర్‌కు అందించారు. 


హెచ్‌ఎండీఏ భూమిలో మున్సిపల్‌ బోర్డులు..

జవహర్‌నగర్‌ పాలక సంస్థ పరిధిలో హెచ్‌ఎండీఏకు చెందిన భూములు ఉన్నాయి. అవి కార్పొరేషన్‌కు చెందిన భూములని మున్సిపల్‌ పేరుమీద బోర్డులు పాతి సర్వేనంబర్‌ 196, 197 గబ్బిలాల్‌పేటలో ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు కాప్రా తహసీల్దార్‌ జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమి సర్వేనంబర్‌ 648, 740లో రెండు లక్షల రూపాయలకు గంగాపురం నాగమణికి నోటరీ ద్వారా విక్రయించారని, అలాగే స్థానికుడు ఉమాకాంత్‌కు చెందిన 160 చదరపు గజాల స్థలాన్ని కార్పొరేటర్‌ భర్త ఆక్రమించుకున్నారని బాధితులు కాప్రా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ జిల్లా కలెక్టర్‌ దృష్టికి ఆ ఫిర్యాదులు తీసుకెళ్లారు. 


మున్సిపల్‌ చట్ట ప్రకారం.. 

మున్సిపల్‌ చట్టప్రకారం.. షోకాజ్‌ నోటీస్‌ అందుకున్న వారు 24  గంటల్లో  తమ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇవ్వకుంటే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2020-08-09T08:45:39+05:30 IST