కలిసికట్టుగా పనిచేయాలి
ABN , First Publish Date - 2021-03-28T05:49:27+05:30 IST
కలిసికట్టుగా పనిచేయాలి
- శివారెడ్డిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్: అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఇంతకు ముందు రైతులకు కరెంటు ఆరుగంటలు మాత్రమే ఇచ్చేవారని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రమోదినీరెడ్డి, ఏఎంసీ చైర్మన్ విజయ్కుమార్, పీఏసీఎస్ వైస్చైర్మన్ పాండు, మాజీ జడ్పీటీసీ ముత్తహార్షరీఫ్ పాల్గొన్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి
వైద్యులు తప్పనిసరిగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వైద్య సిబ్బందితో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాఖలో అమలులో ఉన్న పథకాల గురించి చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
జర్నలిస్టులకు న్యాయం చేస్తాం
వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు అందరికీ సరైన న్యాయం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం సైతం జర్నలిస్టులకు న్యాయం చేస్తోందని వికారాబాద్ ఎమ్మెల్యేఆనంద్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం వికారాబాద్ ప్రెస్క్లబ్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేను కలిసి ఇళ్లస్థలాల కోసం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావన వచ్చిందని, త్వరలోనేరాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక తుది నిర్ణయం తీసుకోబోతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ పాల్గొన్నారు.
ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా టీఆర్ఎస్
ప్రతీకార్యకర్త కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మోమిన్పేట మండలం మేకవనంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చాకలి గోపాల్, వికారాబాద్ మండలం పులిమద్ది గ్రామానికి చెందిన యాదవరెడ్డి ప్రమాదవశాత్తు మృతిచెందగా బాధిత కుటుంబానికి శనివారం ఎమ్మెల్యే ఆనంద్ క్యాంపు కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ కార్యకర్తల బీమా పథకం నుంచి రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాల్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, వెంకటయ్య, శశిధర్రెడ్డి, వెంకట్, ఉపేందర్రెడ్డి, సుభాన్రెడ్డి, సురేష్ పాల్గొన్నారు.