ఘనంగా పెళ్లి ఏర్పాట్లు.. అతిథులను ఆహ్వానిస్తున్న వధువు తల్లిదండ్రులు.. తీరా చూస్తే..
ABN , First Publish Date - 2021-11-22T20:04:48+05:30 IST
అతను ఓ రాజకీయ పార్టీ ప్రతినిధి.. తన కూతురికి పెళ్లి నిశ్చయం కావడంతో వైభవంగా ఏర్పాట్లు చేశాడు.
అతను ఓ రాజకీయ పార్టీ ప్రతినిధి.. తన కూతురికి పెళ్లి నిశ్చయం కావడంతో వైభవంగా ఏర్పాట్లు చేశాడు.. పెళ్లి రోజు కల్యాణ మండపానికి చేరుకుని అతిథులను ఆహ్వానించే పనిలో పడ్డాడు.. ఆ తర్వాత అసలు విషయం గుర్తించాడు.. పెళ్లి ఖర్చుల కోసం తను తెచ్చిన రూ.12 లక్షలు చోరీకి గురయ్యాయని తెలుసుకున్నాడు.. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.. హర్యానాలోని రోహ్తక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
రోహతక్కు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి ధర్మేంద్ర గుగానీ శనివారం జరగాల్సిన కూతురి పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. పెళ్లి సమయంలో అవసరమవుతాయని రూ.12 లక్షలను ఓ బ్యాగ్లో వేసుకుని కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అతిథులను ఆహ్వానించే సమయంలో ఆ బ్యాగ్ను పక్కన పెట్టాడు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత చూస్తే ఆ బ్యాగ్ కనిపించలేదు. దీంతో షాకైన ధర్మేంద్ర కల్యాణ మండప నిర్వాహకులను పిలిచి విచారించాడు. ఆ హాల్లో ఉన్న సీసీటీవీ కెమేరాలను పరిశీలించమన్నాడు.
అప్పటికే ఆ గదిలో ఉన్న సీసీటీవీ కెమేరాలు డ్యామేజ్ అయి ఉన్నాయి. దీంతో దొంగతనం కోసం ఎవరో పక్కాగా స్కెచ్ వేశారని అర్థమైంది. ధర్మేంద్ర వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు.