లోక్సభ ఎన్నికలకు ఆదిత్య థాకరే నాయకత్వం: సంజయ్ రౌత్
ABN , First Publish Date - 2022-02-14T02:25:02+05:30 IST
మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే నాయకత్వంలో తమ పార్టీ 2024లో లోక్సభ ఎన్నికలకు వెళ్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్..
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే నాయకత్వంలో తమ పార్టీ 2024లో లోక్సభ ఎన్నికలకు వెళ్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారంనాడు ప్రకటించారు. ఆదిత్య సారథ్యంలో దేశవ్యాప్తంగా తమ పార్టీ పోటీ చేస్తుందని, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. యూపీ ఎన్నికల్లో బీజేపీని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మట్టికరిపించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడే తాము గోవా నుంచి వచ్చామని, త్వరలోనే ఆదిత్య థాకరేతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్తామని చెప్పారు.
కాంగ్రెస్ నేత రాహుల్పై అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సంజయ్ రౌత్ తప్పుపట్టారు. అసోం ముఖ్యమంత్రి తన యావత్ జీవితం కాంగ్రెస్లో గడిపారని, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీతో పని చేశారని అన్నారు. హిమంత్ బిస్వా శర్మను నాయకునిగా చేసిన మాజీ నేతలను విమర్శించడం సరికాదని అన్నారు. కాగా, 40 మంది సభ్యులున్న గోవాలో శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి శివసేన పోటీ చేస్తోంది. డిజిటల్ మేనిఫెస్టోను గత శనివారం విడుదల చేసింది. ఈనెల 14న గోవా ఎన్నికలు జరుగుతుండగా, మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.