తంజావూరు పర్యటనకు చిన్నమ్మ
ABN , First Publish Date - 2022-03-18T16:06:27+05:30 IST
అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ మళ్లీ ఆధ్యాత్మిక పర్యటనకు బయలుదేరారు. ఇందులోభాగంగా ఆమె గురువారం మధురాంతకం ఏరికాత్త రామర్
- మధురాంతకం ఆలయంలో పూజలు
అడయార్(చెన్నై): అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ మళ్లీ ఆధ్యాత్మిక పర్యటనకు బయలుదేరారు. ఇందులోభాగంగా ఆమె గురువారం మధురాంతకం ఏరికాత్త రామర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తిచేసుకుని బయటకు వచ్చిన శశికళ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో ఆమె జిల్లాల వారీగా పర్యటనలు నిర్వహిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండురోజుల ఆధ్మాత్మిక పర్యటనను గురువారం ప్రారంభించారు. టి.నగర్ లోని తన నివాసం నుంచి ఉదయం 7 గంటలకు ఆమె రోడ్డు మార్గంలో తంజావూరు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉదయం 9 గంటలకు మధురాంతకం ఏరికాత్త రామర్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు పూజారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయంలో కోదండరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి బయలుదేరి మేల్మరు వత్తూరు ఆదిపరాశక్తి ఆలయం, మేల్మలయనూరు అంకాళపరమేశ్వరి, మయిలం మురుగపెరుమాళ్ ఆలయం, తిరువక్కరై వక్రకాళి అమ్మన్ ఆలయాల్లో దైవ దర్శనం చేసుకున్నారు. ఈ మార్గమధ్యంలో దారి పొడవున ఆమెకు అన్నాడీఎంకే కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.