Congress Presidential Polls: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశి థరూర్ నామినేషన్ దాఖలు
ABN , First Publish Date - 2022-09-30T19:19:25+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్ శుక్రవారం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్ శుక్రవారం ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం శశి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక మూల స్తంభంగా గాంధీ కుటుంబం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. ఆ కుటుంబమే తమ పార్టీకి నైతిక బలమని, అంతిమ మార్గదర్శక స్ఫూర్తి అని తెలిపారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, మంచి నేతలు పార్టీని వదిలిపెట్టకుండా నిలువరించవలసిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏకు, గాంధీ కుటుంబం డీఎన్ఏకు అనుబంధం ఉందన్నారు. దేశాన్ని ఏక వ్యక్తి పరిపాలించకూడదన్నారు. తనకు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవన్నారు.
ఇదిలావుండగా, 2020లో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో శశి థరూర్ ఒకరు. పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగాలని వీరు అప్పట్లో డిమాండ్ చేశారు. కానీ ప్రస్తుతం ఆయనకు ఈ నేతల మద్దతు లభించకపోవడం విశేషం.