బీజేపీ మాజీ ఎంపీ శరద్ త్రిపాఠి కన్నుమూత!
ABN , First Publish Date - 2021-07-01T11:50:07+05:30 IST
బీజేపీ మాజీ ఎంపీ శరద్ త్రిపాఠి గురుగ్రామ్లోని...
లక్నో: బీజేపీ మాజీ ఎంపీ శరద్ త్రిపాఠి గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రిలో కన్నుమూశారు. యూపీలోని దేవరియాకి చెందిన బీజేపీ ఎంపీ అయిన రమాపతిరామ్ కుమారుడు, సంత్ కబీర్నగర్ మాజీ ఎంపీ త్రిపాఠి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. శరద్ త్రిపాఠి మృతికి ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత స్వతంత్రదేవ్ సింగ్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
స్వతంత్రదేవ్ సింగ్ ఒక ట్వీట్లో... సంత్కబీర్ నగర్ మాజీ ఎంపీ, బీజేపీ నేత శరద్ త్రిపాఠి కన్నుమూశారన్న వార్త వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. పరమేశ్వరుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని వేడుకుంటున్నాను. త్రిపాఠి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన సంతాప సందేశంలో.. నేను మౌనంగా మారిపోయాను. ఇప్పటికీ త్రిపాఠి నాతో.. దీదీ నియోజకవర్గంలో పనులు చేయాలి అని చెబుతున్నట్లు ఉంది. అయితే ఇది భగవంతుని నిర్ణయం. ఆ ఈశ్వరుడు.. శరద్ త్రిపాఠి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.