అప్పుడు మీరేం చేశారు? మమతను అడిగిన పవార్
ABN , First Publish Date - 2022-02-24T02:06:52+05:30 IST
మనీ లాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్..
ముంబై: మనీ లాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ నేరుగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోనులో మంతనాలు సాగించినట్టు సమాచారం. పది నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సంభాషణలు జరిగాయని, మమతా బెనర్జీ తన మద్దతుతో పాటు సంఘీభావం ప్రకటించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నారదా కేసులో గత ఏడాది సీబీఐ అరెస్టు చేసిన మంత్రులను మీరు సస్పెండ్ చేశారా? ఆ సమయంలో మీరు ఎలా వ్యవహారించారు? అని మమతా బెనర్జీని శరద్ పవార్ అడిగి తెలుసుకున్నట్టు చెబుతున్నారు. కాగా, నవాబ్ మాలిక్ను మంత్రివర్గం నుంచి తప్పించడం ద్వారా బీజేపీ చేతుల్లో పావు కావద్దని శరద్పవార్కు మమతా బెనర్జీ సూచించినట్టు కూడా తెలుస్తోంది.
మమతా బెనర్జీ సైతం గత ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పలువురు టీఎంసీ మంత్రులతో సహా ఆ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకున్నాయి. మంత్రులు రాజీనామా చేయాలంటూ ఆ సమయంలో విపక్షాలు చేసిన డిమాండ్లను మమతా బెనర్జీ గట్టిగా వ్యతిరేకించారు.