కరోనా టీకాకు బదులు... యాంటీ రేబిస్ ఇంజక్షన్... తరువాత?
ABN , First Publish Date - 2021-04-10T13:41:27+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని షమ్లీ జిల్లా పరిధిలోగల...
షమ్లీ: ఉత్తరప్రదేశ్లోని షమ్లీ జిల్లా పరిధిలోగల కందార పీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఈ ఆసుపత్రికి కొవిడ్-19 టీకా కోసం సరోజ్, అనార్కలి, సత్యవతి అనే ముగ్గురు మహిళలు వచ్చారు. వీరిచేత అక్కడున్న సిబ్బంది సిరంజిని కొనుగోలు చేయించి, తెప్పించారు. తరువాత వారికి కొవిడ్ టీకాకు బదులు యాంటీ రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారు.
ఈ సంగతి తెలియని వీరు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత వారికి సైడ్ఎఫెక్ట్స్ కనిపించాయి. దీంతోవారు వెంటనే ఆరోగ్యకేంద్రానికి తిరిగి వచ్చారు. అక్కడి ప్రధాన వైద్యుడు వారిని పరీక్షించగా అసలు విషయం బయటపడింది. దీంతో మహిళల బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆరోగ్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయమై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా చికిత్స అనంతరం బాధితులు కోలుకున్నారు.