క్రీడాకారిణులకు అవమానం
ABN , First Publish Date - 2022-09-21T07:26:17+05:30 IST
వారంతా క్రీడాకారిణులు.. రాష్ట్ర ప్రభుత్వం పోటీలు నిర్వహిస్తామంటే సుదూరం నుంచి వచ్చారు.
టాయిలెట్లో భోజనాలు.. యూపీలో ఘటన
సహారన్పూర్, సెప్టెంబరు 20: వారంతా క్రీడాకారిణులు.. రాష్ట్ర ప్రభుత్వం పోటీలు నిర్వహిస్తామంటే సుదూరం నుంచి వచ్చారు. అలాంటి వారి పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా అమర్యాదగా ప్రవర్తించింది. టాయిలెట్లలో ఆహార పదార్థాలు వడ్డించి క్రీడాకారిణులను అవమానించింది. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లో ఈ నెల 16న ఈ ఘటన జరిగింది. ఆ వీడియోలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహారన్పూర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు సుమారు 300 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. వారి అన్నం, కూరల పాత్రలను టాయిలెట్లో పెట్టగా, పూరీలను అక్కడే నేలపై ఓ పేపర్లో ఉంచడంతో క్రీడాకారిణులు ఇబ్బందులు పడుతూ తిన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశాయి. క్రీడాకారుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం సరికాదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా జిల్లా క్రీడాకాధికారి అనిమేష్ సక్సేనాను సస్పెండ్ చేశామని, క్యాటరింగ్ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టామని అడిషనల్ చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహ్గల్ తెలియజేశారు.