గుట్టుగా.. గంజాయ్‌

ABN , First Publish Date - 2021-10-23T06:08:51+05:30 IST

జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌ పట్టపగ్గాలేకుండా సాగుతోంది. చిత్రవిచిత్ర పద్ధతుల్లో ముఠాలు సరుకు రవాణా చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాయి. కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఎక్కడికక్కడ విక్రయాలు జరుపుతూ రెండుచేతులా సంపాదిస్తున్నాయి.

గుట్టుగా.. గంజాయ్‌
జిల్లాలో కారు డిక్కీలో రవాణా చేస్తుండగా పట్టుబడిన గంజాయి బాక్సులు (ఫైల్‌ ఫొటో)

  • జిల్లాలో పట్టపగ్గాల్లేకుండా గంజాయి స్మగ్లింగ్‌, వినియోగం
  • నిత్యం ఎక్కడోచోట వందల కేజీలతో పట్టుబడుతున్న ముఠాలు
  • విశాఖ నుంచి జిల్లా ఏజెన్సీ మొదలు తుని, అన్నవరం మీదుగా తరలింపు
  • విద్యార్థులే లక్ష్యంగా కిళ్లీ బడ్డీలు,కిరాణా దుకాణాల్లో గుట్టుగా విక్రయాలు
  • గడచిన పది నెలల్లో జిల్లాలో దొరికిన గంజాయి విలువ రూ.11.74కోట్లు
  • పట్టుబడకుండా గుట్టుగా సరఫరా అవుతున్న సరుకు వందల కోట్లలోనే
  • ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు సైతం జిల్లాలో మకాం వేసి లావాదేవీలు

జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌ పట్టపగ్గాలేకుండా సాగుతోంది. చిత్రవిచిత్ర పద్ధతుల్లో ముఠాలు సరుకు రవాణా చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాయి. కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఎక్కడికక్కడ విక్రయాలు జరుపుతూ రెండుచేతులా సంపాదిస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ నుంచి జిల్లా సరిహద్దు మీదుగా నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల నుంచి గ్రామాల వరకు తరలిస్తూ గుట్టుగా విక్రయాలు జరుపుతున్నాయి. ఇదిచాలదన్నట్టు ఏకంగా ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి నుంచి రవాణా చేస్తుండడం విశేషం. తక్కువ సమయంలో లక్షలకు లక్షలు సంపాదిచవచ్చనే ఉద్దేశంతో చదువుకున్న విద్యార్థులు సైతం గంజాయి వ్యాపారంలో దిగి కటకటాలపాలవుతున్నారు. గడచిన పది నెలల్లో జిల్లాలో ఏకంగా రూ.11.74 కోట్ల విలువైన సరుకు పట్టుబడగా, చిక్కకుండా తరలిపోతున్న గంజాయి వందల కోట్లలో ఉంటుందని పోలీసుల అంచనా.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గడచిన రెండేళ్లుగా గంజాయి స్మగ్లింగ్‌, విక్రయాలు రెట్టింపయ్యాయి. కొన్ని ముఠాలు నేరుగా సరుకు కొనుగోలు చేసి ఎక్కడికక్కడ ముద్దల రూపంలో విక్రయించడం ఒక తంతు అయితే, వందల కేజీల సరుకును గుట్టుగా ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తుండడం మరో కోణం. నిత్యం జిల్లాలో ఎక్కడోచోట వందల కేజీల గంజాయి పట్టుబడుతుండడం స్మగ్లింగ్‌ తీవ్రతను చాటుతోంది. అయితే కంటికి చిక్కకుండా రకరకాల మార్గాల్లో తరలిపోతున్న సరుకు వందల కోట్లలోనే ఉంటోంది. వాస్తవానికి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు గుట్టుగా జరుగుతోంది. అక్కడి నుంచి కొన్ని మఠాలు జిల్లాలో రహస్య ముఠాలకు సరుకు చేరవేస్తుండగా, మరికొందరు స్మగ్లర్లు నేరుగా అక్కడి నుంచి గంజాయి జిల్లాలోకి డంప్‌ చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలోని పాడేరు, చింతపల్లి మీదుగా జిల్లాలోని రంపచోడవరం, ఏలేశ్వరం, కూనవరం,చింతూరు, ఎటపాక మీదుగా, ఇటు నర్సీపట్నం నుంచి తుని, అన్నవరం మీదుగా గంజాయి గుట్టుగా జిల్లాలోకి వాలిపోతోంది. ఈ క్రమంలో కార్లు, వ్యాన్సు, బస్సులు, లారీలు, ద్విచక్రవాహనాల్లో ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగా గంజాయి జిల్లాలోకి డంప్‌ అవుతోంది. విశాఖలో గడచిన కొన్ని నెలల్లో పట్టుబడ్డ సరుకు అంతా జిల్లాలోకి, జిల్లా మీదుగా తమిళనాడు, గుజరాత్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలకు రవాణా అవుతున్నట్టు ఇప్పటికే అనేకసార్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈనెల 7న కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో దేవుడి చిత్రపటాలతో ఉన్న అయిదు చెక్కపెట్టెల్లో తరలిస్తున్న 122 కేజీల గంజాయి పట్టుబడింది. ఇది విశాఖ నుంచి తమిళనాడు వైపు ఆటో లో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇందులో తమిళనాడుకు చెందిన సెల్వం అనే నిందితుడుతోపాటు రౌతులపూడికి చెందిన గాది వెంకటరమణ ఉన్నారు. అంటే జిల్లాలో గంజాయి విక్రయాలతోపాటు, సరుకును ఇక్కడి నుంచి పరాయి రాష్ట్రాలకు సైతం పలు ముఠాలు తరలిస్తున్న విషయం బట్టబయలైంది. ఇలా ఎక్కడికక్కడ అనేక స్మగ్లర్లు జిల్లాలోనే మకాం వేసి స్థానికంగా గంజాయి విక్రయాలు, రవాణా కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి జిల్లాలో అనేక ప్రాంతాల్లోకి గంజాయి ముద్దలు, ద్రవరూపంలో వచ్చి  పడుతోంది. అయితే అక్కడక్కడా అధికారపార్టీకి చెందిన చోటా నేతల పాత్ర కూడా స్మగ్లింగ్‌లో వెల్లడవుతుండడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు 16 వరకు జిల్లాలో రూ.11.74 కోట్ల గంజా యి పట్టుబడడం జిల్లాలో పెరిగిన గంజాయి స్మగ్లింగ్‌ తీవ్రతను చాటుతోంది. మొత్తం 163 కేసుల్లో 48 వేల కేజీల గం జాయి, రెండు లీటర్ల ద్రవరూపంలోని సరుకు పట్టుబడగా 517 మంది నిందితులను గుర్తించారు. అయితే పట్టుబడ్డ రూ.11.74 కోట్ల సరుకులో రూ.7 కోట్ల సరుకు గడచిన నాలుగునెలల్లో కావడం విశేషం. మరోపక్క గడచిన ఏడాదిలో జిల్లాలో రహస్యంగా గంజాయి విక్రయాలు జరగడంతోపాటు వినియోగం సైతం పెరగడం కలవరపరుస్తోంది. ముఖ్యంగా మెట్ట, కోనసీమ, డెల్టా ప్రాంతాల్లోని కాలేజీల్లో యథేచ్ఛగా గంజాయి వాడకం జరుగుతోంది. కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా కొన్ని ముఠాలు గంజాయి విక్రయిస్తున్నారు. అటు రెట్టింపు కమీషన్‌తో కిళ్లీ బడ్డీలు, కిరాణా దుకాణాల్లోను గంజాయి అమ్ముతున్నారు. అయితే వీటిపై పోలీసుల నిఘా పెద్దగా లేకపోవడంతో వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఇక కాలేజీ విద్యార్థులే ముఠాలుగా ఏర్పడి స్మగ్లింగ్‌, విక్రయాలు చేస్తున్న ఘటనలు ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ కేసుల్లో వెలుగులోకి వచ్చాయి. కాగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, ముమ్మర తనిఖీలతో విశాఖ నుంచి గంజాయి డంపింగ్‌ అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆదిశగా అడుగులు పడడం లేదు. 

Updated Date - 2021-10-23T06:08:51+05:30 IST