పాలన ఏదీ ?
ABN , First Publish Date - 2020-02-07T09:24:41+05:30 IST
గ్రామ సచివాలయ వ్యవస్థ ఆచరణలో అభాసుపాల వుతోంది. ప్రజల అన్ని సమస్యలు వారి గ్రామం, వార్డులోనే 72 గంటల్లో పరిష్కరించేలా ప్ర భుత్వం నూతనంగా ..
గ్రామ సచివాలయ వ్యవస్థ ఆచరణలో అభాసుపాల వుతోంది. ప్రజల అన్ని సమస్యలు వారి గ్రామం, వార్డులోనే 72 గంటల్లో పరిష్కరించేలా ప్ర భుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఈ వ్యవస్థ ఉద్యోగుల అవగాహనారాహిత్యం, అధికారుల పర్యవేక్షణాలోపం కారణంగా విమర్శల పాలవుతోంది. సచివాలయాలకు రంగులేసి మురిసిపోయిన పాలకులు ఆ తర్వాత వాటి పాలనను మరచిపోయారు. ఏ సచివాలయంలో చూసినా సమయానికి ఉద్యోగులు రారు. ఒక వేళ వచ్చినా వారు ఏపని చేయాలో చెప్పే అధికారు లు లేరు. ఎవరు వస్తున్నారో ఎవరు పని చేస్తున్నారో పర్యవేక్షించే నాథుడే లేడు. చాలా చోట్ల కుర్చీ ఉంటే కంప్యూటర్ ఉండదు. కంప్యూటర్ ఉంటే నెట్ కనెక్షన్ ఉండదు. ఇవన్నీ ఉంటే మిగతావారు కూర్చోవడానికి సరిపడా ఫర్నిచర్ ఉండదు. రికార్డులు భద్రపరచడానికి బీరువాలు అసలే లేవు. ఫర్నిచర్ టెండర్ అస్మదీయులకు అప్పగించడమే ఆలస్యానికి కారణమని తెలిసినా వారిని అడిగే సాహసం ఉన్నతాధికారులు చేయడం లేదు. ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు అందరూ యువతీ యువకులే కావడంతో ఎవరు ఏమిటో తెలుసుకోవడం కష్టంగా ఉంది. కొన్ని చోట్ల రెండు సచివాలయాలు ఒకే చోట పెట్టడంతో ప్రజలు తెలుసుకోలేక గందరగోళానికి గురవుతున్నారు. ఆలోచన ఉండగానే సరిపోదు ఆచరణ కూడా సక్రమంగా ఉండాలని పలువురు పేర్కొంటున్నారు.
గ్రామ, పట్టణ సచివాలయ వ్యవస్థ గందరగోళానికి వే దికగా మారింది. జనవరి 1 నుంచే సచివాలయం నుంచి సేవలు అందిస్తాం అన్నారు..కానీ అమలు కాలేదు. ఆఖరికి జనవరి 26 నుంచి అన్ని రకాల సేవలు అందుబాటులోకి అన్నారు. అయితే ఇది కూడా ఉత్తమాటగానే ఉంది. జిల్లాలో 1207 సచివాలయాలు, 30 వేలకుపైగా వలంటీర్లు, 9123 మంది ఉద్యోగులు ఉన్నా గ్రామ సచివాలయాల నుంచి సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వలంటీర్లు ఎవరు పనిచేస్తున్నారో తెలియడం లేదు. ఉ ద్యోగులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఉన్నతా ధికారులకు ఎలా గైడ్ చేయాలో ఆలోచించుకోవాల్సిన దుస్థితి ఫలితంగా ప్రభుత్వం ఆశించిన ఫలితం రావడం లేదు.
నేటికీ సరఫరా కాని ఫర్నిచర్
జిల్లా వ్యాప్తంగా 896 గ్రామ సచివాలయాలున్నాయి. అదేవిధంగా 311 పట్టణ సచివాలయాలున్నాయి. ఇటీవల వీటిలో ఫర్నిచర్ సరఫరాకు టెండర్లు పిలిచారు. దాదాపు రూ. 16 కోట్లతో టెండర్లు పిలిచారు. కాగా సచివాలయానికి ప్లాస్టిక్ కుర్చీలు 20, టేబుల్స్ 10, ఎస్ టైప్ కుర్చీలు 10, బీరువాలు 1, ఫైల్ ర్యాక్స్ 6 సరఫరా చేయాలి. రిపబ్లిక్ డే రోజున సేవలు ప్రారంభం కావాలి అంటే అంతకు ముందే ఫర్నిచర్ సరఫరా కావాలి. అయితే ఫిబ్రవరి 6వ తేదీ వచ్చినా ఫర్నిచర్ పూర్తి స్థాయిలో సచివాలయాలకు చేర లేదు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి సంబంధిం చిన కన్స్ట్రషన్స్ సంస్థ ఈ టెండర్ దక్కించుకోవడమే ఆలస్యానికి కారణం. ఇందులో ఒక మహిళా డీఎల్పీఓ భర్త, ఒక ఎమ్మెల్యే అనుచరుడు బినామీ కాంట్రాక్టర్లుగా ఉన్నట్లు సమాచారం. ఫలితంగా ఫర్నిచర్ సగానికి పైగా సచివాలయాలకు చేరలేదు. కొన్ని సచివాలయాల్లో ఫర్నిచర్ లేక కింద కూర్చుంటున్నారు. కంప్యూటర్లు కూడా ఒకటి, రెండు మినహా లేవు. ర్యాక్స్, బీరువా, టేబుల్స్ అన్నీ అరకొరగానే అందించారు. అయినా ఉన్నతాధికారులు తాత్సారం చేస్తున్నారు. కనీసం ఆ కాంట్రాక్టర్ను పిలిపించి హెచ్చరించిన దాఖలాలు లేవు.
పర్యవేక్షణ ఏదీ ?
సచివాలయాలపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లా వ్యాప్తం గా 30175 మంది వలంటీర్లు ఉన్నారు. మరో 9123 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులున్నారు. వలంటీర్లు అంతా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అను చరులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సచివాలయ ఉద్యో గులు సైతం వారికి పని చెప్పడానికి భయపడుతున్నారు. వారిలో ఎవరు డ్యూటీ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. పైగా చాలా చోట్ల వలంటీర్లు ఎవరన్నది కూడా తెలియని స్థితి. వీరిపై కమిషనర్, ఎంపీడీఓ స్థాయి అధి కారులు సైతం చర్యలు తీసుకోడానికి వెనుకంజ వేస్తున్నా రు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరిస్థితి మరిం త దారుణంగా ఉంది. ఏం పనిచేయాలో ( జాబ్ చార్జ్) తెలియని దుస్థితి. పైగా వారిపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఉద్యోగులు ఉదయం 10 గంటలకు సచివాలయానికి రావాల్సి ఉన్నా గంట పాటు, గంటన్నర పాటు ఆలస్యంగా వస్తున్నారు.
శిక్షణ ఇవ్వకుంటే సేవలు ఎలా..?
జిల్లాలో 9123 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యో గులున్నాయి. 19 కేటగిరీ ఉద్యోగులున్నారు. వారికి వృత్తిప రమైన శిక్షణ ఇవ్వాలి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం, లైసెన్సుల జారీ, ఆస్తి పన్ను విధించడం, ఇంటి నెంబర్లు ఇవ్వడం, ఆస్తి పన్ను బదలా యింపు(మ్యుటేషన్), కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వంటి సేవలు అందించాలి. మీ సేవ కేంద్రాల్లో మాదిరి 2 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో పలు రకాల పత్రాల ను గ్రామ, వార్డు సచివాలయాల నుంచి జారీ చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 26 నుంచి సేవలు అందించా లనుకుంటే డిసెంబర్ నెలలోపే శిక్షణ ఇచ్చి, వారి సేవలను ప్రారంభించాలి. అయితే నేటికీ 19 కేటగిరీ ఉద్యోగుల్లో చా లా మందికి శిక్షణ ఇవ్వలేదు. దీంతో ఏ తరహా సర్టిఫికెట్ల ను ఎలా జారీ చేయాలి ఎలా సేవలు అందించాలన్న విష యం ఉద్యోగులకు తెలియడం లేదు. దీంతో కార్యాలయాల్లో ఉద్యోగులు కూర్చుని, కబుర్లు చెప్పుకుంటున్నారు.
అనంతపురం రూరల్ : పలు ప్రాంతాల్లో కార్యాల యాలు సమయానికి తెరుచుకోలేదు. దీంతో పలు రకాల పనుల కోసం వచ్చిన ప్రజలు ఉద్యోగుల కోసం నిరీక్షించా ల్సి వస్తోంది. ఎంతసేపటికి ఉద్యోగులు రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగే పరిస్థితులు కొన్ని గ్రామ పంచాయ తీల్లో నెలకొన్నాయి. అనంతపురం రూరల్ మండలం రు ద్రంపేట పంచాయతీలో గ్రామ సచివాలయం ఉద్యోగులు లేకపోవడంతో కార్యాలయం ఖాళీగా దర్శనమిచ్చింది
శింగనమల మండలం రాచేపల్లి సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిజిటల్ అసిస్టెంట్ మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఉద్యోగులు ఎవరూ రాలేదు. పనుల కోసం వచ్చిన ప్రజలు కార్యాలయం వద్దే నిరీక్షిం చారు. శింగనమల మండలంలోని సచివాలయాలకు నెట్ కనెక్షన్లు లేకపోవడంతో సచివాలయ ఉద్యోగులు తమ సెల్ఫోన్ ద్వారా నెట్ కనెక్ట్ చేసుకుని పనులు చేస్తున్నారు. మరోవైపు సచివాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో అటు ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. బుక్కరాయసముద్రం మండం జంతులూరు గ్రామ సచివాలయాన్ని స్థానిక వైపీసీ నాయకులు ఎఫ్పీ షాపుగా ఉపయోగించుకోవడం గమనార్హం. దీంతో ఉద్యో గులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే మండలం కొట్టాలపల్లిలో ఉదయం 10.55 గంటలకైనా ఉద్యోగులెవ రూ హాజరు కాలేదు. గార్లదిన్నె మండల కేంద్రంలోని గ్రా మ సచివాలయం-2 ఉదయం 10.40 గంటలైనా తెర వలేదు. ఉద్యోగులు ఎవరూ హాజరుకాలేదు.
నార్పల మండ ల కేంద్రంలో ఉదయం 10.45 గంటలైనా సచివాలయంలో ఉద్యోగులు కనిపించలేదు. దీంతో కుర్చీలు ఖాళీగా దర్శన మిచ్చాయి. కూడేరు మండలం మరుట్ల గ్రామ సచివాల యంలో ఆలస్యంగా ఉద్యోగులు హాజరయ్యారు. గురువారం ఉదయం 11.42 గంటలకు మహిళా పోలీస్, వీఆర్ఓ, అసిస్టెంట్ ఇంజనీర్ విధులకు వచ్చారు. గ్రామ వలంటీర్లు కూడా ఎప్పుడు పడితే అప్పుడు కార్యాలయానికి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోయారు.
హిందూపురం : పట్టణంలో 43 వార్డు సచివాలయా ల్లో ఒక్కదాంట్లో కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపా లు, కుర్చీలు, టేబుల్స్ లేవు. ప్రధానంగా 8 వార్డు సచి వాలయంలో సిబ్బంది కుర్చునేందుకు సరిపడా కుర్చీలు, టేబుల్ లేకపోవడంతో వలంటీర్లు నిలబడాల్సివచ్చింది. ఇక సచివాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా 10వ వార్డులో కనీసం ఫర్నిచర్ లేకపోవడంతో అధికారులు, వలంటీర్లు చైర్లపైనే కూర్చోవాల్సి వచ్చింది.
పెనుకొండ : మండలంలోని కోనాపురం సచివాల యం 11గంటలైనా తాళాలు తెరవకపోవడంతో గ్రామ వలంటీర్లు సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశా రు. సచివాలయంలో 10మంది ఉండగా ఆరుగురు హాజర య్యారు. వెంకటరెడ్డిపల్లి గ్రామ సచివాలయంలో పది మందికి గాను ఇద్దరు మాత్రమే హాజరయ్యారు.
లేపాక్షి : లేపాక్షిలోఓరియంటల్ పాఠశాల ఆవరణలో ని సచివాలయంలో సిబ్బంది సమయానికి వచ్చినా సదు పాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫర్నిచర్ లేకపోవడంతో విధుల నిర్వహణకు ఇబ్బంది కలుగుతోంది. కంప్యూటర్లకు యూపీఎస్ సౌకర్యం లేకపోవడంతో విద్యుత్పైనే ఆధారపడాల్సి వచ్చింది.
పరిగి : మండలంలోని సగానికిపైగా సచివాలయాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. కొడిగెనహళ్లి-2 సచివా లయం ఒకే గదిలో ఏర్పాటు చేయడంతో సిబ్బంది ఒకే చోట కూర్చోవడం, వలంటీర్లు కూడా ఉండటంతో వచ్చే ప్రజలు ఎవరు ఉద్యోగో, ఎవరో వలంటీరో తెలియక తిక మక పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో మహిళా ఉద్యోగులకు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం రెం డు గంటల తరువాత సిబ్బంది కన్పించలేదు.
రొద్దం : రొద్దం-2 సచివాలయంలో వీఆర్ఓ భరత్ ఒకే ఒక్కడు విధుల్లో ఉన్నాడు. గురువారం మధ్యాహ్నం 12.20కు సచివాలయ ఉద్యోగులు ఎవరూ అందుబాటులో లేరు. వీఆర్ఓను అడిగితే కొంతమంది ట్రైనింగ్లో ఉన్నా రని, మరికొంత మంది భోజనానికి వెళ్లారని తెలిపారు. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
సోమందేపల్లి : స్థానిక సచివాలయంలో 10గంటలకు డిజిటల్ ఆపరేటర్ తలుపులు తెరిచాడు. అతడితోపాటు వీఆర్ఓ, సర్వేయర్తప్పా ఎవరూ హాజరుకాలేదు. 10.30కు మరో ఇద్దరు వచ్చారు. మిగిలినవారు ఫీల్డ్కు వెళ్లారని వచ్చినవారు చెప్పారు.
చిలమత్తూరు : మరువకొత్తపల్లి సచివాలయంలో 8మంది సిబ్బంది ఉండగా ఐదుగురు హాజరయ్యారు. సచివాలయం స్కూల్ భవనంలో ఉండటంతో అటు విద్యా ర్థులు, సిబ్బంది, సచివాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బం దులు పడాల్సి వస్తోంది.
గోరంట్ల : స్థానిక గ్రామ చావడిలో గ్రామసచివాల యం-2లో గురువారం ఉదయం 10గంటలకు తాళాలు తెరవగా 1.45వరకు ఒక్కొక్కరే కార్యాలయానికి రావడం కనిపించింది. కార్యాలయంలో పాత టేబుల్పై కంప్యూటర్ ఏర్పాటు చేయగా నాలుగు చైర్లు, ఒక బెంచి ఉంది. దీంతో సిబ్బంది, ప్రజలు కూర్చొవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు శిథిలావస్థలో ఉండటంతోపాటు నీటి వసతి లేకపోవడంతో అరకిలోమీటరు దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది.
గుంతకల్లు: పట్టణంలోని భాగ్యనగర్ సచివాలయంలో పదిన్నరకు నలుగురు కార్యదర్శులు మాత్రమే వచ్చారు. 16 మంది వలంటీర్లలో ఒకరు మాత్రమే వచ్చారు. ఈ సచివాలయంలో టేబుళ్లు లేనందున సిబ్బంది సప్లయర్స్ వాడే భోజన టేబుళ్లను వేసుకుని కూర్చున్నారు. పామిడి లో అల్లీపీరా గార్డెన్ మునుపటి అన్నా క్యాంటీన్లో సచివా లయాన్ని ఏర్పాటుచేయగా, ఫర్నిచర్ లేకపోవడంతో క్యాం టీన్లో వాడిన భోజన టేబుళ్లను సిబ్బంది వాడుకున్నారు. సచివాలయ సిబ్బంది 10-25 గంటలకు కేవలం ఇద్దరే వ చ్చారు. మిగతావారు 11 గంటలకు చేరుకున్నారు. ఫర్ని చర్ సమస్య ఉంది. గుత్తి మండలం జక్కలచెరువు సచి వాలయంలో పదిన్నరకు నలుగురు కార్యదర్శులు మాత్ర మే వచ్చారు. గుత్తి మున్సిపాలిటీలోని 12వ వార్డులో సిబ్బంది సకాలంలో వచ్చినా, ఫర్నిచరు లేనికారణంగా కింద కూర్చుని విధులను నిర్వహించారు. ఒక టేబులు, రెండు కుర్చీలు మినహా ఫర్నిచరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
ఉరవకొండ హెడ్ పోస్టాఫీసు వద్ద ఉన్న 1వ సచివా లయంలో 11 గంటలైనా సిబ్బంది హాజరుకాలేదు. ఈ సచివాలయంలో కుర్చీలు వచ్చినా టేబుళ్లు సరఫరా కాని కారణంగా పాత టేబుళ్లను తెచ్చి పనిచేశారు. సర్వేయరు వచ్చి సంతకాలు చేసి ట్రైనింగ్ ఉందని వెళ్లిపోయారు. పంచాయతీ కార్యదర్శి 11 గంటలైనా రాలేదు. మండ లంలోని నింబగల్లులో 10-40 గంటలకు నలుగురు కార్య దర్శులు మాత్రమే వచ్చారు. ఇక్కడ బాత్రూము, తాగు నీటి సౌకర్యం లేని కారణంగా ఇబ్బందులుపడ్డారు. విడప నకల్లు మండలం కొత్తకోట గ్రామంలో సిబ్బంది 10-30 గంటలకు సచివాలయానికి వచ్చారు.
కదిరి : డివిజన్లో 125 సచివాలయాలు ఉన్నాయి. చాలా సచివాలయాల్లో ఉద్యోగులు సమయపాలన లేకుం డా ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు విధులకు హాజ రయ్యారు. అనేకచోట్ల తాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్స్ లేక ఉద్యోగులు ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కదిరి మున్సిపాల్టీలో 27 సచి వాలయాలు ఉండగా ఇందులో ఐదు మాత్రమే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. మిగతా వాటిని అద్దె భవనాల్లో ఏర్పా టు చేశారు. సచివాలయం- 14 ఉదయం 10.30 గంటలు అయినా కార్యాలయం తెరుచుకోలేదు. వరండాలో కొంత మంది ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు వేచి ఉన్నారు. అద్దె భవనాల్లో ఉన్న సచివాలయాలు పైఅంతస్తులో ఉం డటంతో వృద్ధులు ఎక్కడానిక ఇబ్బందులు పడుతున్నారు. తనకల్లులో 14 సచివాలయాలు ఉన్నాయి, తాగునీరు, ఫర్నిచర్స్ సమస్య ఉంది. నల్లచెరువులో 10 సచివాలయా లు ఉన్నాయి, ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు కరు వయ్యాయి. గాండ్లపెంటలో ఆరు ఏర్పాటు చేశారు. టాయి లెట్లు, తాగునీరు లేవు. ఎన్పీకుంటలో 10 సచివాల యా లు ఉండగా, వెలిచెలమల సచివాలయానికి సంబంధించి న ఉద్యోగులు ఉదయం 11 గంటలు అయినా విధులకు హాజరు కాలేదు. తలుపులలో 13 సచివాలయాలు ఉండగా అన్నింటిలోనూ టేబుల్, టాయిలెట్లు, తాగునీటి కొరత ఉంది. కదిరిరూరల్లో 12 సచివాలయాలు ఉండగా, ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు కరువయ్యాయి.
శింగనమల : మండలంలో 13 సచివాలయాల్లో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వచ్చి వెళ్లిపోతున్నారు. సచివాల యం ఉద్యోగులు ఏదైనా క్యాంపు వెళ్లాలంటే మామేట్ రిజిస్టర్లో రావాలి. ఈ మామేట్ రిజిస్టర్ ఏ సచివాలయం లో కనిపించలేదు. సచివాలయాలకు కంప్యూటర్లు ఇచ్చి నా నెట్ కనెక్షన్లు లేకపోవడంతో సచివాలయ ఉద్యోగులు తమ సెల్ఫోన్ ద్వారా నెట్ కనెక్ట్ చేసుకుని పనులు చే స్తున్నారు. చాలా చోట్ల నెట్ రావడం లేదు. రాచేపల్లి సచి వాలయం వద్ద ఉదయం 11 గంటలపైన అధికారులు రా కపోవడంతో ప్రజలు అధికారుల కోసం పడిగాపులు కాశారు. సచివాలయంకు ఎక్కడ టాయ్లెట్లు లేవు. దీంతో మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
రాయదుర్గం: పట్టణంలోని 12వ సచివాలయంలో కంప్యూటర్ లేకపోవడంతో పాటు విధులకు ఇరువురు మాత్రమే హాజరయ్యారు. చాలాచోట్ల ఫర్నిచర్ లేకపోవ డంతో మున్సిపల్ స్కూళ్లల్లో వాటిని తీసుకొచ్చి వాడుకుం టున్నారు. మండలంలోని వడ్రేహొన్నూరు, బీఎన్హళ్లి సచివాలయాల్లో రికార్డులు భద్రపరచుకునేందుకు, విధులు నిర్వర్తించేందుకు టేబుళ్లు, ఇతర సామగ్రి లేదు. బీఎన్హ ళ్లిలో ఉదయం 10.50 గంటలకు ఐదుగురు ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. అదేవిధంగా వడ్రవన్నూరు, టీ వీరాపురం గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు విధులకు హాజరుకాలేదు. గుమ్మఘట్టగ్రామ సచివాలయంలో నాలుగు కుర్చీలు మాత్రమే కనిపించాయి. వీఆర్వో వీరేష్ మాత్రమే విధులకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఆయన కార్యాల యంలో విధుల్లో ఉండి వెళ్లిపోయారు. సచివాలయానికి మంజూరైన ఫర్నిచర్, కంప్యూటర్లు వేరే ఇంట్లో ఉంచినట్లు ఆయన తెలిపారు.
కలుగోడులో ఉదయం 10 గంటలకు ఇద్దరు ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకాగా 10.50 గంటలకు పంచాయతీ కార్యదర్శి శ్వేతపద్మిని హాజరయ్యారు. మిగతా ఉద్యోగులెవరూ హాజరుకాలేదు. కణేకల్లు పట్టణంలోని 4వ సచివాలయంలో ఉదయం 10.30 గంటలైనా కార్యాలయం తెరచుకోలేదు. సచివాల య వ్యవస్థకు ప్రధానమైన కంప్యూటర్ అందుబాటులో లేదు. ప్రభుత్వం నుంచి తమకు కంప్యూటర్లు ఇంకా సరఫరా కాలేదని అధికారులు తెలుపుతున్నారు. బొమ్మ నహాళ్ సచివాలయంలో భవనం నిర్మాణంలో ఉండటంతో ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయంలోనే ఒక గదిని కేటా యించారు. తగినంత సామగ్రి లేకపోవడంతో సచివాలయ ఉద్యోగులు ఆలస్యంగా వస్తున్నారు. వీరి కోసం ప్రజలు సచివాలయానికి చేరుకుని పడిగాపులు కాశారు.
ధర్మవరం : గ్రామ సచివాలయాలు గురువారం నుంచి ప్రారంభం కాగా, అనేక చోట్ల సిబ్బంది కొరతతో పాటు కనీస వసతులు కూడా లేకపోవడంతో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. పుట్టపర్తి మండలం కర్నాటక నాగేపల్లి సచివాలయంలో 10మంది సిబ్బందికి గాను కేవలం నలుగురిని మాత్రమే కేటాయించారు. వీరిలో కూడా ఒకరిద్దరు మాత్రమే విధులకు హాజరు కాగా, మిగిలిన వారు ట్రైనింగ్ పేరిట డుమ్మా కొట్టారు. సచివాలయంలో కనీస వసతులు కూడా కరువయ్యాయి. ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్ చెప్పున ఉండగా, కావల్సిన ఫర్నిచర్ లేదు. సప్లయర్ షాపులో టేబుల్ తెచ్చుకుని వాడుకునే దుస్థితి నెలకొంది.
తాడిపత్రి : నియోజకవర్గంతోపాటు పుట్లూరు, యల్ల నూరు మండలాలతో కలిపి 121 సచివాలయాలను ప్రభు త్వం ఏర్పాటుచేసింది. తాడిపత్రిలో 30వార్డు సచివాల యాలు ఉన్నాయి. వాటిలో ఎక్కడ చూసినా సర్వర్ల సమస్య, బాత్రూంల సమస్య, కుర్చీల సమస్య ఎక్కువగా ఉంది. సచివాలయ ఉద్యోగులు కూడా సమయపాలన పాటించడం లేదు. ఎవరూ ఎప్పుడు వస్తారో ఎక్కడ ఉంటారో తెలియడం లేదు. పట్టణంలోని మార్కెట్లో ఉన్న వార్డు సచివాలయాన్ని గోదాములో ఏర్పాటుచేశారు. కూర్చోవడానికి కుర్చీలు లేవు. దీంతో లబ్ధిదారులతోపాటు వలంటీర్లు, ఇతర ఉద్యోగులు చాప లపై కూర్చొంటున్నారు. తాడిపత్రి మండలంలో మొత్తం 19గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఆయా సచివాలయాల్లో ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరుకావడం లేదు. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మండ లంలోని దిగువపల్లి సచివాలయంలో ఉదయం 11గంటలకు ఒక ఉద్యోగి మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఏడుగురు ఉద్యోగులు కనిపించలేదు. వారిలో కొందరు ఎంపీడీఓ ఆఫీసులో ఉన్నామని, మరికొందరు విధినిర్వహణలో బయట ఉన్నామని తెలిపారు. సచివాలయంలో రెండు కంప్యూటర్లు ఉండాల్సి ఉండ గా ఒకటి మాత్రమే ఉంది. యాడికి మండలంలో 16 సచివాల యాలు ఉన్నాయి. మండలకేంద్రంలోని 3, 4, 5 సచివాలయా లను బీసీ హాస్టల్ భవనంలో నిర్మిస్తున్నారు. ఈ భవనం పైకప్పు శిథిలావస్థకు చేరుకోవడంతో పెచ్చులు ఊడిపడుతోంది. దీంతో సచివాలయ ఉద్యోగులు భయంభయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. 4, 5 సచివాలయాలు ఒకేగదిలో నిర్వహిస్తుండ డంతో ఏది ఎక్కడో కనుక్కోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పెద్దపప్పూరు మండలంలో 14 సచివాలయాలు ఉన్నాయి. మండలకేంద్రంలోని సచివాలయంలో 11గంటలు అయినా సిబ్బంది పూర్తిస్థాయిలో రాలేదు. డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు మాత్రమే హాజరయ్యారు. ఫర్నిచర్ తక్కువగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పెద్దవడుగూరు మండలంలో 15 సచివాలయాలు ఉన్నాయి. పలు సచివాలయాల్లో మరుగుదొడ్ల సమస్యతో సిబ్బంది ఇబ్బం దులు పడుతున్నారు. ఫర్నిచర్ సమస్య ఉద్యోగులు, వలంటీర్లను వెంటాడుతోంది. యల్లనూరు మండలంలో 14 సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మండలకేంద్రంలో రెండు సచివాలయాల్లో ఉదయం 10:30గంటలకు ఇద్దరు వలంటీర్లు మాత్రమే హాజర య్యారు. ఒక సబ్ఇంజనీర్, ఒక వీఆర్వో, ఒక పంచాయతీ సెక్రటరీ, ఒక సోషల్ వెల్ఫేర్ సిబ్బంది కనిపించారు. మరుగుదొడ్ల సమస్య వెంటాడుతోంది.
పుట్లూరు మండలంలో మొత్తం 13గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 130మంది ఉద్యోగులకు గాను 95మంది ఉన్నారు. ఫర్నిచర్ సమస్యతో వలంటీర్లు కిందనే కూర్చొంటున్నారు. పలు గ్రామాల్లోని సచివాలయాల్లో ఉద్యోగులు ఆలస్యంగా వస్తున్నారు. మండలకేంద్రంలోని సచివాలయానికి 10మంది అధికారులకు గాను ముగ్గురే హాజరయ్యారు. వీరందరూ 10:15గంటలకు విధులకు హాజరయ్యారు.