Challan : రెండో రోజూ రికార్డులు.. ఒక్కరోజే ఖజానాకు రూ.11 కోట్లు
ABN , First Publish Date - 2022-03-03T13:40:03+05:30 IST
ట్రాఫిక్ అధికారులు ప్రకటించిన చలాన్ల రాయితీ ప్రారంభమైన రెండోరోజూ కూడా..
- ఈ-అదాలత్లో 10.5 లక్షల చలానాలు క్లియర్
- మొత్తం 17 లక్షలకు పైగా చలానాలు క్లియర్
- రెండు రోజుల్లో రూ.19కోట్లు జమ
- ఆన్లైన్ సమస్యలనూ అధిగమించాం: రంగనాథ్
హైదరాబాద్ సిటీ : ట్రాఫిక్ అధికారులు ప్రకటించిన చలాన్ల రాయితీ ప్రారంభమైన రెండోరోజూ కూడా రికార్డుస్థాయిలో పెండింగ్ చాలానాలు క్లియర్ చేశారు. ఈ-అదాలత్ ద్వారా రాయితీ ప్రకటించిన తొలిరోజు రూ.7 లక్షలకు పైగా చలానాలు క్లియర్ కాగా, రూ.7.5కోట్లు వసూలయ్యాయి. తొలిరోజు నమోదైన రికార్డును బద్దలు కొడుతూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల చరిత్రలో ఇంతపెద్ద మొత్తంలో పెండింగ్ చలానాల బిల్లులు చెల్లించడం రికార్డుగా నమోదైంది. మొత్తం 10.5 లక్షల చలానాలు క్లియర్ చేయడంతో రూ.11కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. చలానాలు చెల్లించిన వారిలో అధికంగా మూడు కమిషనరేట్లకు చెందిన వాహనాలే ఉన్నాయని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
పెరిగిన ఆన్లైన్ సామర్థ్యం
పెండింగ్ చలానాల చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం లేకుండా ఉండేలా అధికారులు ఈ-చలానా చెల్లింపు పోర్టల్ను మరింత మెరుగు పరిచారు. అయినా కొంతమందికి సమస్యలు తప్పలేదని ట్విటర్ వేదికగా వివరించారు. ఆయా సమస్యలను కూడా అధిగమించినట్లు సాంకేతిక సిబ్బంది వివరించారు. ఈ నెల 31వరకు సమయం ఉన్నందున తొందర పడకుండా వాహనదారులు తమ పెండింగ్ చలానాలు చెల్లించుకోవచ్చని కోరారు.