ఇంటర్నెట్ డెస్క్: రిస్కైనా సరే లెక్కచేయకుండా స్టాక్ మార్కెట్లో దూకుడుగా ట్రేడింగ్ చేసిన ఓ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ చివరికి తన ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు. ట్రేడింగ్ కోసం చేసిన అప్పులు తీర్చే క్రమంలో కస్టమర్ల సొమ్మును పక్కదారి పట్టించి చివరికి కటకటాలపాలయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ నగరంలోని ఆదర్శ నగర్ బ్రాంచ్లో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం..ఎస్బీఐలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న హేమత్ వర్మ..షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి ఏకంగా 30 లక్షలు నష్టపోయారు. అయినా సరే లెక్కచేయక..మరో 20 లక్షలు అప్పుచేసి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ..ఈ మారు కూడా ఆయనకు నిరాశే ఎదురైయ్యింది. మరోవైపు.. వడ్డీ కింద నెల నెలా భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో బ్యాంకులోని కస్టమర్ల సొమ్ముపై ఆయన కన్నుపడింది.
కొందరు కస్టమర్ల ఎకౌంట్ల నుంచి వారికి తెలీకుండానే.. 9.5 లక్షల రూపాయలను ఇతర అకౌంట్లకు మళ్లించి స్వలాభం కోసం వినియోగించుకున్నారు. అయితే..తమ సొమ్ము ఇలా అకస్మాత్తుగా మాయమవడంతో కస్టమర్లు బ్యాంకు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీంతో..బ్యాంక్ మేనేజర్ ఈ ఏడాది ఏప్రిల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా.. తన బాగోతం బయటపడటంతో హేమంత్ పారిపోయారు. ఆయన కోసం ఇంతకాలంగా గాలిస్తున్న పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.