ముస్లింవాద పితామహుడు సత్యాగ్ని
ABN , First Publish Date - 2021-12-06T05:13:38+05:30 IST
తెలుగు సాహిత్యంలో ముస్లింల జీవన స్థితిగతులను మైనార్టీవాదం ఏర్పడక ముందే కథల ద్వారా చిత్రించిన ముస్లింవాద పితామహుడు షేక్ హుస్సేన్ (సత్యాగ్ని) అని మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్
కడప (మారుతీనగర్), డిసెంబరు 5: తెలుగు సాహిత్యంలో ముస్లింల జీవన స్థితిగతులను మైనార్టీవాదం ఏర్పడక ముందే కథల ద్వారా చిత్రించిన ముస్లింవాద పితామహుడు షేక్ హుస్సేన్ (సత్యాగ్ని) అని మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సీపీబ్రౌన్ పరిశోధన కేంద్రంలో ప్రముఖ కథా రచయిత షేక్ హుస్సేన్ రచించిన దివార్ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై దివార్ కథాసంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. సత్యాగ్ని కథల్లో ముస్లింల ఆచారాలు, మూఢాచారాలపై తిరుగుబాటు, సుఖదు:ఖాలు, ఆర్థిక ఒడిదుడుకులు, మహిళా చైతన్యం వంటి అనేక అంశాలు కనిపిస్తాయన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ సత్యాగ్నిలో కవి, నటుడు, పాత్రికేయుడు, కథకుడు, సినీ దర్శకుడు, రాజకీయనాయకుడు తదితర కోణాలున్నాయన్నారు. కార్యక్రమంలో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు కె.మధుజ్యోతి, ఆత్మీయ అతిథి పాలగిరి విశ్వప్రసాద్రెడ్డి, సాహిత్య విమర్శకులు తవ్వా వెంకటయ్య, నగర ప్రముఖులు పుత్తా బాలిరెడ్డి పుత్తా పుల్లారెడ్డి, ఆచార్య ఓబుళరెడ్డి, జానమద్ది విజయభాస్కర్, మాచిరెడ్డి, ఆయన సతీమణి సంజీవమ్మ, అలపర్తి పిచ్చయ్య చౌదరి, బాలయల్లారెడ్డి, భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, చింతకుంట శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.