వైభవంగా చక్రస్నానం

ABN , First Publish Date - 2022-05-17T06:14:08+05:30 IST

సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవాలలో భాగంగా ఆరోరోజైన సోమవారం చక్రస్నానం కార్యక్రమం వేడుకగా జరిగింది.

వైభవంగా చక్రస్నానం
చక్రస్నానం నిర్వహిస్తున్న దృశ్యం

పంపాసరోవరంలో వేడుకగా కార్యక్రమం
అన్నవరం, మే 16: సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవాలలో భాగంగా ఆరోరోజైన సోమవారం చక్రస్నానం కార్యక్రమం వేడుకగా జరిగింది. ఉదయం 9 గంటలకు నవ దంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను, పెండ్లిపెద్దలైన సీతారాములను మేళతాళాలు, వేదమంత్రాల నడుమ దిగువ ఘాట్‌రోడ్డు గుండా పంపా సరోవర తీరానికి తీసుకుని వచ్చారు. అక్కడ సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై ఉన్న వెండి సింహాసనంపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి ప్రధానార్చకులు కోట శ్రీను ఆధ్వర్యంలో పండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేదికపై ఉన్న స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పాత్రలో అభిషేక ద్రవ్యాలను వేసి అభిషేకం నిర్వహించారు. తర్వాత నవదంపతులను, సుదర్శన చక్రం, త్రిశూలంను మంగళవాయిద్యాలతో పంపా సరోవరంలోకి తీసుకునివెళ్లి స్నానమాచరింపజేశారు. తిరిగి తీరం వద్ద నున్న వేదిక వద్దకు తీసుకునివచ్చి విశేష అర్చనలు నిర్వహించి చతుర్వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. వైదిక కార్యక్రమాలను ముత్య సత్యనారాయణ, పాలంకి చినపట్టాభి, వి.జె.డిశర్మ తదితరులు నిర్వహించగా ఈవో త్రినాథరావు, చైర్మన్‌ రోహిత్‌, సహాయ కమిషనర్‌ రమే్‌షబాబు, పీఆర్వో కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:14:08+05:30 IST