సారూ.. కాలు మొక్కుతాం

ABN , First Publish Date - 2021-11-13T06:44:03+05:30 IST

కాలు మొక్కుతాం.. పరిహారం ఇచ్చేంత వరకు పనులు నిలపండి అంటూ చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు బాధితులు దేవరకొండ ఆర్డీవో గోపిరాంను వేడుకున్నారు.

సారూ.. కాలు మొక్కుతాం
ఆర్డీవో గోపిరాం కాళ్లపైపడి వేడుకుంటున్న ముంపు బాధితుడు ఏసోబు

పరిహారం ఇచ్చేంత వరకు పనులు నిలపండి : ముంపు బాధితులు

నల్లగొండ/మర్రిగూడ: సారు.. కాలు మొక్కుతాం.. పరిహారం ఇచ్చేంత వరకు పనులు నిలపండి అంటూ చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు బాధితులు దేవరకొండ ఆర్డీవో గోపిరాంను వేడుకున్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌ పనులను నిలిపివేయాలని నర్సిరెడ్డిగూడెం గ్రామస్థులు చేపట్టిన ధర్నా శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. విషయం తెలుసుకున్న ఆర్గీవో గోపిరాం రిజర్వాయర్‌ వద్ద చేరుకొని ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు సహకరించాలని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మూడు నెలల్లో పరిహారం, పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని బాధితుడు పెరమళ్ల ఏసోబు ఆర్డీవో కాళ్లు మొక్కాడు. ఇప్పటివరకు చాలామార్లు వచ్చి హామీ ఇచ్చారని, అయినా నెరవేరలేదని, పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తేనే ధర్నా విరమిస్తామని స్పష్టం చేశాడు. దీంతో ఆర్డీవో వెనుదిరిగారు. ఆర్డీవో వెంట తహసీల్దార్‌ దేశ్యానాయక్‌, ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - 2021-11-13T06:44:03+05:30 IST