శంకర్నారాయణకు మతిభ్రమించింది
ABN , First Publish Date - 2022-05-19T05:54:00+05:30 IST
పెనుకొండ ఎమ్మెల్యే శంకర్నారాయణ మంత్రి పదవి పోయి, మతిభ్రమించి ఏవేవో మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎద్దేవా చేశారు.
మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి
సోమందేపల్లి, మే 18: పెనుకొండ ఎమ్మెల్యే శంకర్నారాయణ మంత్రి పదవి పోయి, మతిభ్రమించి ఏవేవో మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు శంకర్నారాయణకు లేదన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నిస్పృహలో ఉంటూ ఎమ్మెల్యే ఏవేవో ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఇప్పటికే ఆయనకు స్పష్టమైందన్నారు. పెనుకొండ నుంచి తిరిగి ధర్మవరం వెళ్లేందుకు ఆయనకు ఎక్కువ కాలం పట్టదన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా పనిచేసినా కూడా శంకర్నారాయణ నియోజకవర్గంలోని రోడ్లనే వేయలేకపోయారన్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు సభ జరిగే ప్రదేశంలో ఉన్న రోడ్డు పనులకు టీడీపీ హయాంలోనే నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. అనంతరం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత మాట్లాడుతూ శంకర్నారాయణ వలంటీరుపై చేయిచేసుకునే పరిస్థితి వచ్చిందంటే వారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అర్థం అవుతుందన్నారు. ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు.